Telugu News  /  Andhra Pradesh  /  Kidnap Case Filed Against Nellore Rural Mla Kotamreddy Sridhar Reddy
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Kidnap Case On Kotamreddy: ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు

04 February 2023, 9:51 ISTHT Telugu Desk
04 February 2023, 9:51 IST

kidnap case filed against nellore rural mla: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఓ కార్పొరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.

Nellore Rural MLA Kotamreddy Sridhar reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కేసు నమోదైంది. వేపడారుపల్లికి చెందిన 22వ డివిజన్‌ కార్పొరేటరు విజయభాస్కర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో వేదాయపాళెం పోలీసులు శుక్రవారం రాత్రి చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యేతో పాటూ ఆయన అనుచరుడు మిద్దె మురళీకృష్ణ యాదవ్‌, కారు డ్రైవరు అంకయ్యలపై సెక్షన్‌ 448, 363ల కింద కిడ్నాప్‌కు ప్రయత్నించారని కేసు నమోదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

తన ఆఫీసులో ఉన్న ఎమ్మెల్యే ఫొటోను తొలగించడంతో శుక్రవారం సాయంత్రం కోటంరెడ్డి తన ఇంటికి వచ్చి బెదిరించారని.. ఆయన నుంచి ప్రాణహాని ఉందంటూ కార్పొరేటర్‌ విజయ్ భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అంతు చూస్తామని బెదిరించడంతోపాటు.. తన ఇంటికి వచ్చి భయాందోళనకు గురిచేసిన ఎమ్మెల్యే అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఎమ్మెల్యే ఫోన్‌ చేసి వైసీపీని వీడి తనతో రావాలని కోరారని.. అందుకు తాను నిరాకరించనని ప్రస్తావించారు. ఎమ్మెల్యే అనుచరులు ఇంటికి వచ్చి బలవంతంగా కారులో ఎక్కించేందుకు యత్నించగా ప్రతిఘటించి పోలీసుస్టేషన్ కు చేరుకున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదైంది.

కోటంరెడ్డికి బెదిరింపులు..!

మరోవైపు ఎమ్మెల్యే కోటంరెడ్డికి వచ్చిన ఓ బెదిరింపు కాల్ ఒకటి సోషల్ మీడియా వైరల్ అవుతోంది. వైసీపీ నేత బోరుబడ్డ అనిల్‌ మాట్లాడుతున్నట్లు ఆడియోలో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ పెద్దల జోలికి వస్తే.. నెల్లూరు అంగళ్ల మధ్య బండికి కట్టుకుని లాక్కొని వెళ్తాను అంటూ అందులో మాట్లాడారు. ఇందుకు స్పందించిన కోటంరెడ్డి… నేరుగా కలిసి అన్ని విషయాలపై మాట్లాడుకుందామంటూ బదులిచ్చారు. అయితే కడప నుంచి నెల్లూరు ఎంతో దూరంలో లేదని.. ఐదు నిమిషాల్లో వచ్చి లాక్కొనిపోతా అంటూ సదరు వ్యక్తి వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా స్పందించలేదు. ఈ ఆడియో కాల్ పై క్లారిటీ రావాల్సి ఉంది.

తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సొంత పార్టీపై కోటంరెడ్డి తిరుగుబాటుకు దిగిన సంగతి తెలిసిందే. పలు ఆధారాలను కూడా బయటపెట్టారు. అధినాయకత్వంపై సూటిగానే విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. మరోవైపు కోటంరెడ్డి వ్యవహరాన్ని సీరియస్ గా తీసుకున్న వైసీపీ అధినాయకత్వం చర్యలు చేపట్టింది. నెల్లూరు రూరల్ ఇంఛార్జ్ గా ఉన్న కోటంరెడ్డిని తొలగించి.. ఆయన స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించింది. మరోవైపు కోటంరెడ్డిపై వైసీపీ ముఖ్య నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. జగన్ లేకపోతే.. కోటంరెడ్డి జోరో అంటూ ఎదురుదాడికి దిగుతున్నారు.