కొనసాగుతున్న ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు - కీ, మెరిట్ లిస్టులు ఎప్పుడంటే...?-key updates on the release of ap mega dsc exam keys 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కొనసాగుతున్న ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు - కీ, మెరిట్ లిస్టులు ఎప్పుడంటే...?

కొనసాగుతున్న ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు - కీ, మెరిట్ లిస్టులు ఎప్పుడంటే...?

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మొత్తం 16,347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షలన్నీ 30వ తేదీతో పూర్తవుతాయి. ఆ వెంటనే వీటికి సంబంధించిన కీలు అందుబాటులోకి వస్తాయి.

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు 2025

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఎగ్జామ్స్… 30 తేదీతో పూర్తికానున్నాయి. విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… సబ్జెక్టుల వారీగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. చివరిరోజు స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) పరీక్షతో అన్ని పేపర్లు ముగుస్తాయి.

ఏపీ డీఎస్సీ కీలు ఎప్పుడంటే…?

విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను పరీక్షలు పూర్తయిన రెండు రోజుల్లో విడుదల చేస్తారు. అంటే జున్ 30వ తేదీతో ఎగ్జామ్స్ ముగుస్తాయి. జూలై 2వ తేదీన ప్రాథమిక కీలను విడుదల చేస్తారు.

విద్యాశాఖ విడుదల చేసే ప్రాథమిక కీలపై 7 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన మరో 7 రోజుల తర్వాత ఫైనల్ కీలను అందుబాటులోకి తీసుకువస్తారు. తుది కీ విడుదల చేసిన మరో ఏడు రోజుల తర్వాత మెరిట్ జాబితాలు విడుదలవుతాయి. అంటే ఆగస్టు నాటికి డీఎస్సీ పరీక్షల మెరిట్ జాబితాలపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కీలను విడుదల చేసే విషయం లేదా అభ్యంతరాలను పరిశీలించే విషయంలో ఒకటి రెండు ఆలస్యమైతే…. ఒకటి రెండు రోజులు అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది.

  • చివరి పరీక్ష పూర్తయిన తర్వాత 2వ రోజు నుంచి ప్రాథమిక కీ విడుదల చేస్తారు.
  • ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించడానికి 7 రోజుల సమయం ఇస్తారు.
  • అభ్యంతరాలు పూర్తైన తేదీ నుంచి 7 రోజుల తర్వాత తుది కీ విడుదల చేస్తారు.
  • తుది కీ విడుదల చేసిన 7 రోజుల్లో డీఎస్సీ మెరిట్ లిస్టులు ప్రకటిస్తారు.

ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీలోని అన్ని ఖాళీలకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. పరీక్షలన్నీ పూర్తయ్యాక… సబ్జెక్టుల వారీగా హాజరైన అభ్యర్థుల విషయంలో క్లారిటీ రానుంది.

ఇక డీఎస్సీ ఫలితాల్లో టెట్ స్కోర్ కీలకంగా ఉంటుంది. ఇందులో సాధించే వెయిటేజీని డీఎస్సీ మార్కులకు జత చేశారు. ఈ రెండింటి ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాలను జిల్లాల వారీగా విడుదల చేస్తారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.