Kakinada Ration Rice : పవన్ కల్యాణ్ తనిఖీలు చేసిన షిప్ లో1320 టన్నుల పీడీఎస్ బియ్యం, కలెక్టర్ కీలక ప్రకటన
Kakinada Ration Rice : కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకలో 1320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు నిర్థారించామని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. పోర్టులో ఇంకా 12 వేల టన్నుల బియ్యం లోడ్ చేయాల్సిన ఉందన్నారు. వీటిలో పీడీఎస్ బియ్యం లేవని నిర్థారించాకే లోడింగ్కు అనుమతిస్తామన్నారు.
Kakinada Ration Rice : కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కీలక ప్రకటన చేశారు. స్టెల్లా నౌకలో 1320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించామన్నారు. గత 29న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును పరిశీలించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులతో పీడీఎస్ బియ్యం ఉన్న స్టెల్లా నౌక పరిశీలించారు. ఈ వ్యవహారం సంచలనం అవ్వడంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు.
స్టెల్లా షిప్ లో 1320 టన్నుల పీజీఎస్ బియ్యం
కాకినాడ పోర్టు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కలెక్టర్ షాన్ మోహన్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. గత నెలలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్టెల్లా నౌకను పరిశీలించిన అనంతరం 5 విభాగాల అధికారులు బృందం ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందం 12 గంటల పాటు స్టెల్లా షిప్లోని 5 కంపార్ట్మెంట్లలో తనిఖీలు నిర్వహించింది. మొత్తం 12శాంపిల్స్ సేకరించారు. ఈ షిప్లో దాదాపు 4 వేల టన్నుల బియ్యం రవాణా అవుతున్నాయన్నారు. వీటిలో 1,320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్టు నిర్ధరించామన్నారు. సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ బియ్యం ఎగుమతి చేస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు. వాళ్లు ఎక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారు అనే దానిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందన్నారు.
ఇంకా 12 వేల టన్నుల బియ్యం
కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకలో 1,320 టన్నుల రేషన్ బియ్యాన్ని అన్లోడ్ చేయించి సీజ్ చేస్తామని కలెక్టర్ షాన్ మోహన్ ప్రకటించారు. పోర్టులో ఇంకా 12 వేల టన్నుల బియ్యం లోడ్ చేయాల్సిన ఉందన్నారు. వీటిలో పీడీఎస్ బియ్యం లేవని నిర్థారించాకే లోడింగ్కు అనుమతిస్తామన్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు, డీప్ సీ వాటర్ పోర్టులో కూడా మరో చెక్పోస్టు ఏర్పాటు చేశామన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా నిఘా పెట్టామన్నారు. ఒక్క గ్రాము పీడీఎస్ బియ్యం కూడా దేశం దాటకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామన్నారు. స్టెల్లా షిప్ను ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. నిజాయితీగా రైస్ బిజినెస్ చేసే వారికి ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుందన్నారు. వ్యాపారులు, కూలీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు.
నవంబర్ 27న కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్లో 640 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ పోర్టులోకి వెళ్లి పరిశీలించారు. ఆయన అధికారికంగానే 640 టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవంబర్ 29న కాకినాడ వచ్చారు. ఆయనతో పాటు సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ను కూడా తీసుకొచ్చారు. సౌత్ ఆఫ్రికాకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ పనమా షిప్ను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
సంబంధిత కథనం