రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... కడపలో జరగనున్న మహానాడు సభను వాయిదా వేసేందుకు చర్యలు తీసుకోవాలని వైసీపీ కోరుతున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా ఇవాళ కడప కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున జరిగే సభలు, సమావేశాలు ఈ పరిస్థితుల్లో ప్రజలకు ప్రమాదకరమవుతాయని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ మహానాడు సందర్భంగా కరోనా వ్యాపించే అవకాశం ఉన్నందున వాయిదా వేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు.
అయితే ఈసారి చరిత్రలో నిలిచిపోయే మహానాడు నిర్వహిస్తామని టీడీపీ చెబుతోంది. ఈ మేరకు నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 27, 28, 29న కడప సమీపంలోని కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె మండలం పబ్బపురం సమీపంలో 150 ఎకరాల్లో మహానాడు సభ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సభ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో తూర్పున సీఎం తాత్కాలిక కార్యాలయం, సీఎం కార్యదర్శులు, ఇతర అధికారుల వసతి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభ వేదిక, భోజనశాల, జనరేటర్లు, విద్యుత్ సరఫరా ఏర్పాటు పనులు ముమ్మరంగా చేస్తున్నారు. మహానాడు కోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు సభ ఏర్పాట్లు సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
ఐజీ (ఆపరేషన్స్) సీహెచ్ శ్రీకాంత్, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఇటీవల మహానాడు ఏర్పాట్లను పరిశీలించారు. వీరితో పాటు వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం ఎస్పీలు, గుంతకల్ రైల్వే ఎస్పీ....వేదిక, పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన వేదిక, ఫుడ్ కోర్టుల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
మహానాడు ప్రారంభం నుంచి ముగింపు వరకు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతో ఉండాలని కోరారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు.
మహానాడు కార్యక్రమానికి దాదాపు 3 మెగావాట్ల విద్యుత్ అవసరమని విద్యుత్ అధికారులు అంచనా వేశారు. సీఎం చంద్రబాబు హాజరయ్యే కార్యక్రమం కావడంతో, జనరేటర్లకు ఏదైనా సమస్య ఎదురైతే విద్యుత్ సరఫరాకు కృష్ణాపురం, కడప నగరం-1 విద్యుత్ సబ్స్టేషన్ల ఫీడర్ల నుంచి లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.
జనరేటర్ల నుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ను ఉపయోగించే అవకాశం ఉంది.
సంబంధిత కథనం