కడప జిల్లా బద్వేల్ సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటనను పోలీసులు ఛేదించారు. యువతిపై దాడికి పాల్పడిన విఘ్నేష్ అనే యువకుడిని కడప శివారులో అరెస్టు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ తెలిపారు. విఘ్నేష్ పక్కా పథకం ప్రకారమే ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
నిందితుడు విఘ్నేష్ కడపలోని ఓ హోటల్ వంట మాస్టర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి వివాహం అయ్యింది. అతడి భార్య గర్భిణి. విఘ్నేష్, బాధిత బాలిక(16)కు ఐదేళ్ల పరిచయం ఉంది. బాధితురాలు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. శుక్రవారం విఘ్నేష్, విద్యార్థినికి ఫోన్ చేసి కలవాలని కోరాడు. లేదంటే తాను సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు. దీంతో విద్యార్థిని శనివారం కాలేజీ నుంచి ఆటోలో బయలుదేరగా...మార్గమధ్యలో విఘ్నేష్ ఆ ఆటో ఎక్కాడు. వీరిద్దరూ బద్వేలుకు సుమారు 10 కి.మీ. దూరంలో ఉన్న సెంచురీ ఫ్లైవుడ్ ఫ్యాక్టరీ సమీపంలో ఆటో దిగిపోయారు. అనంతరం వారిద్దరూ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లి కాసేపు శరీరకంగా కలిశారు.
బాధిత బాలిక తనను పెళ్లి చేసుకోవాలని అడగడంతో విఘ్నేష్ కోపంతో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాలిక బిగ్గరగా కేకలు వేయడంతో విఘ్నేష్ అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికులు బాలికను గుర్తించి, కాపాడారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల బాలికను కడప రిమ్స్కు తరలించారు. రిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి 2.30గంటలకు విద్యార్థిని మృతి చెందింది.
బాలికపై దాడి చేయాలనే ఉద్దేశంతోనే విఘ్నేశ్ ఆమెకు ఫోన్ చేసి రప్పించాడని ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. నిందితుడు కడప నుంచి వచ్చేటప్పుడు పెట్రోల్ బాటిల్ తన బ్యాగ్లో పెట్టుకొని వచ్చాడు. పక్క పథకం ప్రకారమే విఘ్నేష్ విద్యార్థిపై పెట్రోల్తో దాడి చేశాడు. గతంలో వీరద్దరూ ప్రేమించుకున్నారు. బాలిక పెళ్లి ప్రస్తావన తేవడంతో విఘ్నేష్ ఆమెను దూరం పెట్టాడు. ఆ తర్వాత మళ్లీ కలిశారు. శనివారం కూడా బాలిక పెళ్లి ప్రస్తావన తేవడంతో విఘ్నేశ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు.
కడప జిల్లా బద్వేల్ లో ప్రేమోన్మాది దాడిలో ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైంది. పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని కడప రిమ్స్ కు తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో యువతి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. యువతి చివరి మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. "అతడు వేరే అమ్మాయితో లేచిపోయాడు. నిన్న నాకు ఫోన్ చేసి రమ్మన్నాడు. నేను రానని చెప్పాను. నాకు నవ్వు కావాలి. రాకపోతే చనిపోతా అన్నాడు. సరే అని వెళ్లాను. లైటర్ తో డ్రెస్సుకు నిప్పంటించాడు" అని యువతి పోలీసులకు తెలిపింది. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి...ఆదివారం ఉదయం మృతి చెందింది.
సంబంధిత కథనం