ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన-jobs for local tribals in agency areas ap cm chandrababus key announcement ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Sarath Chandra.B HT Telugu

ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గిరిజన సంక్షేమ శాఖపై నిర్వహించిన సమీక్షల్లో ఈ మేరకు స్పష్టత ఇచ్చారు.ఏజెన్సీ గిరిజనులకు ఉద్యోగాల కల్పినకు జీవో నంబర్‌ 3 పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలని ప్రకటించిన చంద్రబాబు

ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో నూరు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరంలో జీ.వో నెంబర్ 3 తెచ్చామని సిఎం చంద్రబాబు గుర్తు చేశారు. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్ 3 పునరుద్దరణకు తీసుకావల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూనే... 2020లో రద్దయిన జీ.వో నెంబర్ 3 పునరుద్దరణకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు.

సోమవారం సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ఈ రివ్యూలో గిరిజన సంక్షేమ శాఖ, న్యాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సమస్య సంక్లిష్టం

1986లో వచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజనులకు టీచర్ పోస్టుల్లో 100 శాతం రిజర్వేషన్లు తెచ్చామని చంద్రబాబు చెప్పారు. దీనిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో మళ్లీ పెరిగిన మహిళ రిజర్వేషన్ల శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని 2000 సంవత్సరంలో జీవో ఎంఎస్ నంబర్ 3 తెచ్చినట్టు వివరించారు.

ఈ జీవో అమలు చేయడం ద్వారా సుమారు 4,626 టీచర్ ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు దక్కాయని జీవో నెంబర్ 3 పై 2002లో కొందరు కోర్టును ఆశ్రయించగా... వివిధ స్థాయిల్లో విచారణ అనంతరం 2020లో ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని గత ప్రభుత్వం దీనిపై రివ్యూ పిటిషన్ వేయడంలో తీవ్ర నిర్లక్ష్యం పాటించిందని చంద్రబాబు చెప్పారు. దీంతో రివ్యూ పిటిషన్ ను కూడా సుప్రీం కోర్టు కొట్టేసిందని ఈ కారణంగా గిరిజనులు జీవో నెంబర్ 3 ద్వారా లభించే లబ్దిని కోల్పోయారని సీఎం వివరించారు.

చట్టపరమైన అడ్డంకులపై అధ్యయనం

జీవో నెంబర్ 3 పునరుద్దణ లేదా అదే తరహా న్యాయం చేసేందుకు గిరిజనులకు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు జీ.వో నెంబర్ 3 రద్దు అనంతర పరిణామాలపై అధికారులతో సీఎం చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో జీవో 3 ద్వారా నాడు గిరిజనులకు కలిగిన లబ్దిని పునరుద్దరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు నూరు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న అవకాశాల గురించి, చట్టపరంగా ఉన్న వివిధ అనుకూలతలు, అడ్డంకుల గురించి చర్చించారు. జీ.వో నెంబర్ 3 పునరుద్దరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గిరిజనుల, గిరిజన సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి సిఎం అధికారులకు సూచించారు.

ఈ నేపథ్యంలో తిరిగి ఈ ఉత్తర్వుల ద్వారా లభించే లబ్దిని గిరిజనులకు తిరిగి అందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని... ఇందులో భాగంగా న్యాయ పరమైన అంశాలు, సుప్రీంకోర్టు తీర్పు, గిరిజన హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలను అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు.

ముఖ్యమంత్రి ముందు మూడు ఆప్షన్లు

జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై ప్రస్తుతం ఉన్న మూడు అవకాశాల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మొదటి ఆప్షన్‌గా ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో 100 శాతం రిజర్వేషన్లు స్థానిక గిరిజనులకు కల్పించడం, రెండవ ఆప్షన్‌గా స్థానిక గిరిజనులకు వారి యెక్క జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం, మూడవ ఆప్షన్‌గా సుప్రీంకోర్టు సూచించినట్టు 50 శాతం మించకుండా స్థానిక గిరిజనులకే రిజర్వేషన్లు కల్పించి వారి హక్కులను పరిక్షించడం వంటి అవకాశాలను అధికారులు సిఎం దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై సీఎం మాట్లాడుతూ “గిరిజన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో గిరిజనుల హక్కులకు కట్టుబడి ఉన్నామని...ఎన్నికల సమయంలో చెప్పినట్లు జీ.వో నెంబర్ 3 పునరుద్దరించడం లేదా...అదే స్థాయిలో గిరిజనులకు న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.

గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు...విద్య-వైద్య సదుపాయాలు కల్పిస్తూ, ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. వారికి న్యాయం చేసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం