Jio 5G: ఆంధ్రప్రదేశ్‍కు జియో 5జీ వచ్చేసింది.. విశాఖ, తిరుమలతో పాటు మరో రెండు నగరాల్లో.. ఉచిత ఆఫర్ కూడా..-jio true 5g launched in andhra pradesh starts with tirumala visakhapatnam vijayawada guntur ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Jio True 5g Launched In Andhra Pradesh Starts With Tirumala Visakhapatnam Vijayawada Guntur

Jio 5G: ఆంధ్రప్రదేశ్‍కు జియో 5జీ వచ్చేసింది.. విశాఖ, తిరుమలతో పాటు మరో రెండు నగరాల్లో.. ఉచిత ఆఫర్ కూడా..

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 26, 2022 10:18 PM IST

Jio 5G launch in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‍లో 5జీ నెట్‍వర్క్ అడుగుపెట్టింది. రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో 5జీ సర్వీస్‍లను లాంచ్ చేసింది జియో. దీంతోపాటు యూజర్లకు ఉచితంగా అన్‍లిమిటెడ్ డేటా వాడుకునేలా వెల్‍కమ్ ఆఫర్ అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాలు ఇవే..

Jio 5G: ఆంధ్రప్రదేశ్‍లో జియో 5జీ వచ్చేసింది
Jio 5G: ఆంధ్రప్రదేశ్‍లో జియో 5జీ వచ్చేసింది

Jio 5G launch in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‍లో జియో 5జీ నెట్‍వర్క్ అందుబాటులోకి వచ్చేసింది. యూజర్లకు హైస్పీడ్ డేటాను అందించే కొత్తతరం 5జీ సర్వీసులు లాంచ్ అయ్యాయి. తిరుమల (Tirumala), విశాఖపట్నం (Visakhapatnam), విజయవాడ (Vijayawada), గుంటూరు (Guntur) నగరాల్లో 5జీ నెట్‍వర్క్‌ను రోల్అవుట్ చేసింది దిగ్గజ టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio). విజయవాడలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో.. రాష్ట్ర పరిశ్రమలు , ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి.. జియో ట్రూ 5జీ (Jio True 5G), జియో ట్రూ 5జీ పవర్డ్ వైఫై సర్వీస్‍లను లాంచ్ చేశారు. ఈ నాలుగు నగరాల్లోని యూజర్లకు జియో వెల్‍కమ్ ఆఫర్ కూడా అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాలు ఇవే..

ట్రెండింగ్ వార్తలు

అప్పటి కల్లా రాష్ట్రమంతా..

2023 డిసెంబర్ నాటికి రాష్ట్రమంతా జియో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. పట్టణాలు, గ్రామాలు ఇలా రాష్ట్రం మొత్తం 5జీ సేవలు అప్పటికల్లా లాంచ్ అవుతాయని అన్నారు. రాష్ట్రంలో రిలయన్స్ జియో ఇప్పటికే రూ.26వేల కోట్ల పెట్టుబడి పెట్టిందని, 5జీ నెట్‍వర్క్ కోసం మరో రూ.6,500కోట్లు వెచ్చిస్తోందని ఆయన అన్నారు.

కాగా, 5జీ సర్వీసుల ద్వారా వైద్య రంగంలో వచ్చే మార్పులను ఈ కార్యక్రమంలో జియో ప్రదర్శించింది. జియో కమ్యూనిటీ మెడికల్ కిట్, ఏఆర్-వీఆర్ పరికరాలను ఆవిష్కరించింది.

జియో 5జీ నెట్‍వర్క్ ప్రజలకు మెరుగైన టెలికమ్యూనికేషన్ నెట్‍వర్క్ అందించడం మాత్రమే కాకుండా.. ఈ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటీ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి తోడ్పడుతుందని సీఎస్ జవహర్ రెడ్డి అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, ఐఓటీ, బ్లాక్ చెయిన్ లాంటి స్టార్టప్‍లపై పని చేస్తున్న స్టార్టప్‍లకు కూడా 5జీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.

ఉచితంగా జియో వెల్‍కమ్ ఆఫర్

Jio Welcome offer: జియో 5జీ నెట్‍వర్క్ లాంచ్ అయిన నగరాల్లోని యూజర్లకు వెల్‍కమ్ ఆఫర్ ఉచితంగా లభించనుంది. 5జీ నెట్‍వర్క్‌కు సపోర్ట్ చేసే మొబైల్‍లో జియో వాడుతున్న వారికి ఈ జియో వెల్‍కమ్ ఆఫర్ అందుబాటులోకి వస్తుంది. ఇందుకోసం జియో.. మెసేజ్ రూపంలో యూజర్లకు ఓ ఇన్వెట్ పంపుతుంది. దీని తర్వాత యూజర్లు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా 1జీబీపీఎస్ వేగంతో అన్‍లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. అంటే ఎలాంటి లిమిట్ లేకుండా 5జీ డేటా పొందవచ్చు.

వీఆర్ హెడ్‍సెట్ ధరించి జియో 5జీ సర్వీసుల గురించి తెలుసుకుంటున్న మంత్రి గుడివాడ అమర్నాథ్
వీఆర్ హెడ్‍సెట్ ధరించి జియో 5జీ సర్వీసుల గురించి తెలుసుకుంటున్న మంత్రి గుడివాడ అమర్నాథ్

హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పాటు దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో 5జీ నెట్‍వర్క్ ను అందుబాటులోకి తెచ్చింది జియో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‍లోనూ అడుగుపెట్టింది.

WhatsApp channel