Janasena PawanKalyan:నమ్మకం కుదిరితే ఒంటరిగానే పోటీ…పవన్ కళ్యాణ్
Janasena PawanKalyan వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం కుదిరితే ఒంటరిగా పోటీ చేయడానికి కూడా జనసేన సిద్ధమేనని , ఎన్నికల్లో బలిపశువుగా మాత్రం జనసేన మిగిలిపోదని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఖచ్చితంగా శాసనసభలో అడుగుపెట్టేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Janasena PawanKalyan 2024 ఎన్నికల్లో శాసనసభలో అడుగుపెట్టడమే లక్ష్యంగా జనసేన వ్యూహరచన చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన దగ్గర డబ్బు లేదని, ఎన్నికల్లో జనాలకు డబ్బులు పంచలేదని, గెలుస్తామనే నమ్మకం కుదిరితే ఒంటరిగానే 175స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.
ట్రెండింగ్ వార్తలు
పదేళ్లలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు అండగా నిలబడ్డామని పవన్ ప్రకటించారు. సీఎంకు పాలన దక్షత లేక పోవడం వల్లే ఏపీకి రాజధాని లేకుండా పోయిందని పవన్ కళ్యాణ ఆరోపించారు. తనతో సహా పోటీ చేసే అభ్యర్థులంతా గెలిచే తీరాలని, తమ దగ్గర డబ్బుల్లేవని, డబ్బులు పంచలేమని జనసేనానని స్పష్టం చేశారు. ఎవరి ఓటు వారే కొనుక్కుని జనసేనకు ఓటు వేయాలని సూచించారు.
మచిలీపట్నంలోని సుల్తాన్నగరంలో జరిగిన జనసేన పదో ఆవిర్భావ సభలో పవన్ సుదీర్ఘంగా మాట్లాడారు. విజయవాడ ఆటోనగర్ నుంచి మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో వారాహిపై బయల్దేరిన పవన్ కళ్యాణ్ రాత్రి దాములూరు టోల్ గేట్ వరకు 38 కి.మీ యాత్ర కొనసాగించారు. అప్పటికే బాగా ఆలశ్యం అయిపోవడంతో వారాహి నుంచి కిందకు దిగి కారులో సభా స్థలికి చేరుకున్నారు.
కాపుల ఐక్యతే ప్రధానం…
కులాల మధ్య ఐక్యత, రాజకీయ ప్రత్యామ్నయం కోసం కాపులు పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం, పొత్తులు తదితర అంశాలను పవన్ కళ్యాణ్ ప్రధానంగా ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని నేరుగా చెప్పనప్పటికీ, ఆ అవసరాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వమే కల్పిస్తోందని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో ఒంటరి పోరుపై కూడా పవన్ తన వైఖరి చెప్పారు. ‘‘జనం సీఎం సీఎం అని నినాదాలు చేస్తున్నా ... అంతా జనసేనకు అండగా ఉంటామని సంపూర్ణమైన నమ్మకం వచ్చి... క్షేత్రస్థాయిలో సమాచారం తెప్పించుకుని, అధ్యయనం చేసి, జనసేన గెలుస్తుందంటే ఒంటరిగా వెళ్లడానికి తాను వెనుకాడనని చెప్పారు’’
బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వనేలేదు..
బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి రోడ్మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని, రాష్ట్రస్థాయిలో కలిసి కార్యక్రమాలు చేయడానికి ఇక్కడి నాయకులే ముందుకు రావడంలేదని పవన్ బందరు సభలో చెప్పారు. ‘‘అనుకున్న ప్రణాళికను అమలు చేసి ఉంటే ఇప్పుడు టీడీపీతో అవసరంలేని స్థాయికి ఎదిగేవాళ్లమన్నారు.
ఏపీలో లాంగ్ మార్చ్ పెడదామన్నానని పార్టీ బలోపేతమవుదామని చెప్పానని, అందుకు ఢిల్లీలో ఒప్పుకున్నారని సాయంత్రానికి అదేంలేదని అన్నారన్నారు. కలిసికట్టుగా కార్యక్రమాలు నడపకపోతే తానేం చేయాలన్నారు. అమ్మ పెట్టదు... అడుక్కు తిననివ్వదు అన్నట్లుందని ఆరోపించారు.
"మీరు చేయరు. నన్నూ చేయనివ్వరు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ స్థాయి నాయకత్వం దృష్టికి కూడా తెచ్చానని, తాను అనుకున్నట్లుగా జరిగి ఉంటే... వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంలో తెలుగుదేశం అనేదే వచ్చేది కాదన్నారు. టీడీపీ మీద నాకు ప్రత్యేక ప్రేమ లేదని, చంద్రబాబు మీద ఆరాధనా భావం లేదని చెప్పారు. కానీ చంద్రబాబు మీద గౌరవముందని, ఆయన సమర్థుడు’’ అని పవన్ పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు... 20 సీట్లకే పవన్ పరిమితం... అంటూ వాట్సాప్లో వచ్చిన ప్రతి ఒక్కటీ నమ్మొద్దని పార్టీ అభిమానులకు సూచించారు. దేశానికి బలమైన నాయకుడు కావాలన్న ఉద్దేశంతోనే గతంలో మోదీ నేతృత్వంలోని బీజేపీకి మద్దతు ఇచ్చానని తెలిపారు.
అమరావతిపై పోరాటం ఆగదు….
అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తామని పవన్ ప్రకటించారు. ఎన్నికల్లో ‘ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా ఉండాలని చెప్పారు. ‘‘సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని, ఏదో చిన్న పిల్లవాడు, తెలియకుండా మాట్లాడేశారని సకల శాఖ మంత్రి ఇప్పుడు చెబుతున్నారని పవన్ మండిపడ్డారు. సిమెంటు కంపెనీలు పెట్టడానికి, ఇసుక దోచుకోవడానికి, మద్యం పేరుతో దోచుకోవడానికి మాత్రం చిన్న పిల్లవాడు కాదా అని ప్రశ్నించారు. ఇసుక, మద్యంలో మొత్తం నగదు లావాదేవీలే నడుస్తున్నాయని, ఆ డబ్బులతోనే మళ్లీ ఓట్లు కొంటారని ఆరోపించారు. మూడు రాజధానులంటూ మోసం చేస్తున్నారన్నారని, ఇద్దరు అసిస్టెంట్ లోకాయుక్తలను నియమించలేని వాళ్లు కర్నూలును న్యాయ రాజధాని చేయగలరా అని ఎద్దేవా చేశారు.
కాపులు బాధ్యత తీసుకోవాలి….
రాష్ట్ర రాజకీయాలు మారాలంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ ఆకాంక్షించారు. సిఎం ఇతర కులాలకు భయపడరని, వారికి సంఖ్యాబలం లేదని చెప్పారు. కాపులంతా ఐక్యంగా ఉంటే... మిగిలిన కులాల వారూ వెంట నడుస్తారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కులాలను విడదీసే కుట్రలు పన్నుతోందని పవన్ విమర్శించారు. కులాలను ఐక్యంగా ఉంచాలన్నది జనసేన సిద్ధాంతమని, అలాంటి తనను కులం పేరుతో దూషిస్తూ కులాన్ని అమ్మేస్తున్నానని అంటుంటే బాధేస్తుందన్నారు.
కులాల కాష్టం నుంచి ఏపీలో జనం బయటకు రావాలని పిలుపునిచ్చారు. ‘‘కాపులు ఆరాధించే వంగవీటి రంగా చేసుకుంది ఓ కమ్మవారి ఆడపడుచునని, నాయకులు కులాలు దాటి తమ పిల్లలను ఇతర కులాల వారికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారని వారికి లేని కులాలు మీకు ఎందుకు? దాని వల్ల అభివృద్ధి ఆగిపోతుందన్నారు.
తాను టీడీపీని అందలం ఎక్కించడానికి ఉన్నాను.. కమ్మవారి కొమ్ము కాస్తున్నామని ఆరోపిస్తున్నారని, తనను తిట్టే కాపు నాయకులందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఊడిగం చేస్తున్నారని నేను తిట్టలేనా అని ప్రశ్నించారు. ఒక్క కులం మీద సమాజాన్ని నడపలేమని... ఒకరిపై ఒకరు పరస్పరం ఆధారపడి ఉన్నామని పవన్ చెప్పారు.
‘‘వంగవీటి రంగా కాపులకు ఆరాధ్యదైవం. ఆయన తనను చంపేస్తున్నారని చెప్పినా కుల నాయకులు ఎందుకు అండగా నిలవలేదన్నారు. చనిపోయిన తర్వాత ఆయనకు విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏముందన్నారు. ఏపీలో ‘‘ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తున్నారని,రాష్ట్రంలో బీసీలకు ఇవ్వాల్సిన నిధులనూ పక్కదారి పట్టిస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కుల పెత్తనం ఆగిపోవాలని, అన్ని కులాలకు ప్రాతినిధ్యం దక్కాలంటే జనసేన అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. అగ్రకులాల్లో ఉన్న పేదల గురించి కూడా జనసేన ఆలోచిస్తోందని చెప్పారు.
వారాహి తొలి పరుగులో 38 కిలోమీటర్ల ప్రయాణం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం వారాహి తొలి అడుగును ఘనంగా ప్రారంభించింది. విజయవాడ ఆటోనగర్ నుంచి మచిలీపట్నంలో తలపెట్టిన పార్టీ 10వ ఆవిర్భావ సభా ప్రాంగణానికి వారాహి విజయ యాత్రను ప్రారంభించింది. విజయవాడ ఆటోనగర్ గేట్ వద్ద నుంచి వారాహి యాత్ర ప్రారంభమయ్యింది. ఆటోనగర్, కానూరు, తాడిగడప, పోరంకి, పెనమలూరు సెంటర్లలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు పార్టీ శ్రేణులు భారీ గజమాలలతో స్వాగతం పలికారు. 65వ నంబర్ జాతీయ రహదారితో పాటు చుట్టు పక్కల ఉన్న అపార్ట్ మెంట్లు, భవనాలు, ఎత్తైన ప్రదేశాలన్నీ పవన్ కళ్యాణ్ ను చూసేందుకు వచ్చిన జనసందోహంతో నిండిపోయాయి.
మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వారాహి మీద సభా స్థలికి బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన కోసం వచ్చిన జనప్రవాహం మధ్య సుమారు 38 కిలోమీటర్లు 5 గంటల పాటు ప్రయాణించారు. పవన్ కళ్యాణ్ ను అనుసరిస్తున్న వేలాది వాహనాలను నియంత్రించడం పోలీసుల వల్ల కాకపోవడం, సభకు ఆలస్యం కావడంతో జాతీయ రహదారి 65పై ఉన్న దావులూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత వారాహి నుంచి దిగి కారు ఎక్కారు. అదే కారులో సభా స్థలికి చేరుకున్నారు. మార్గమధ్యంలో పామర్రు, గూడూరుల్లో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు రోడ్డుపై వేచి ఉండడంతో కారు పై నుంచి వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
టాపిక్