Pawan Kalyan: జనసేన గెలుపు.. బీసీల గెలుపు, శాసించే స్థాయికి ఎదగాలన్న పవన్-jana sena chief pawan kalyan key comments in bc leaders meeting ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Jana Sena Chief Pawan Kalyan Key Comments In Bc Leaders Meeting

Pawan Kalyan: జనసేన గెలుపు.. బీసీల గెలుపు, శాసించే స్థాయికి ఎదగాలన్న పవన్

HT Telugu Desk HT Telugu
Mar 12, 2023 06:14 AM IST

Pawan Kalyan meeting with BC leaders:జనసేన గెలుపు బీసీల గెలుపు అన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని వ్యాఖ్యానించారు. బీసీలు, దళితులు, కాపులు కలిస్తేనే రాజ్యాధికారం తథ్యమన్నారు.

బీసీలతో నిర్వహించిన సమావేశంలో పవన్
బీసీలతో నిర్వహించిన సమావేశంలో పవన్

Jana Sena Chief Pawan Kalyan: బీసీలు, దళితులు, కాపులు కలిస్తేనే రాజ్యాధికారం తథ్యమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో బీసీ సంఘాల నేతలతో శనివారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడిన ఆయన... బీసీలకు ఆర్థిక పరిపుష్ఠి చేకూరితే రాజకీయ సాధికారత దానంతటదే వస్తుందన్నారు. కార్పొరేషన్ల పేరిట పనికిమాలిన పదవులిచ్చి చేతులు దులుపుకున్నారని వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు. సబ్ ప్లాన్ నిధులు అడిగితే ఫించన్లు.. అమ్మ ఒడి లెక్కలు చూపుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ మోసాన్ని ప్రశ్నించకుంటే బీసీల జీవితాలు మారవన్న ఆయన... అర్ధ రూపాయికి ఓటు అమ్ముకోవడం మానేలా అవగాహన కల్పించాలని కోరారు.

ట్రెండింగ్ వార్తలు

బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని... బ్యాక్ బోన్ క్లాస్ అని వ్యాఖ్యానించారు. పవన్. దేశ సంస్కృతికి బీసీలు వెన్నెముక అని... అత్యధిక సంఖ్యా బలం ఉండి కూడా నేటికి దేహి అనే స్థితిలో ఉండటం బాధాకారమని చెప్పారు. బీసీలు హక్కుల కంటే ముందు ఐక్యత సాధించాలని అభిప్రాయపడ్డారు. బీసీలకు సాధికారిత రావాలని చెప్పే నాయకులేనే ఇప్పటివరకు చూశారని... కానీ చేతల్లో చూపించి నాయకత్వాన్ని తానే చూపిస్తానంటూ మాట్లాడారు. పోరాటం చేసేందుకు ముందుకు వచ్చే 146 బీసీ కులాలు... బీసీ వ్యక్తిని గెలిపించుకునేందుకు ఎందుకు నిలబడలేకపోతున్నాయని ప్రశ్నించారు.

56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటిని కారు స్టిక్కర్లకు మాత్రమే పరిమితం చేశారని, రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని మండిపడ్డారు పవన్.బొత్సకు మంత్రి పదవిస్తే తూర్పు కాపులంతా అభివృద్ధి చెందినట్లు కాదని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు ఎలాంటి సాధికారత లేదని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో కాపులు తనని సొంతం చేసుకుని ఉంటే ఓడిపోయేవాణ్ని కాదని పవన్ కామెంట్స్ చేశారు. గోదావరి జిల్లాల్లో తమ వచ్చిన ఓట్లలో సగానికిపైగా బీసీలవే అని చెప్పారు. తనకు ఓ కులాన్ని అంటగట్టి, ఇతర వర్గాల వారితో తిట్టిస్తున్నారన్న పవన్.... కాపులను బీసీలతో తిట్టిస్తే క్షేత్రస్థాయిలో ఆ రెండు వర్గాలవారు కొట్టుకోవాలనేది కొంత మంది పన్నాగమని చెప్పారు. కుట్రలు చేస్తున్న నాయకులు ఏ పార్టీలో ఉన్నా తిట్టుకోరు.. మంచిగా మాట్లాడుకుంటారు. దాన్ని అందరూ గమనించాలని కోరారు పవన్ కల్యాణ్.

జనసేన అధికారంలోకి వస్తే టీటీడీలో సగం పదవులు బీసీలకే ఇస్తామని ప్రకటించారు పవన్ కల్యాణ్. వైసీపీ ప్రభుత్వం రూ.34 వేల కోట్ల ఉప ప్రణాళిక నిధుల్ని దారి మళ్లించిందని ఆరోపించారు. ఒక్క రూపాయి కూడా దారి మళ్లకుండా చివరి రూపాయి కూడా బీసీలకే దక్కేలా కృషి చేస్తానని చెప్పారు. జీవో 217 తీసుకొచ్చి చెరువుల్ని అర్థబలం ఉన్నవారికి కట్టబెట్టి, మత్స్యకారులను దేహీ అనే పరిస్థితికి తీసుకొచ్చారన్న పవన్... ఆ సమస్యలను పరిష్కారిస్తామన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బీసీ సంఘాల ప్రతినిధులు... పలు సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు.

IPL_Entry_Point