వైసీపీ చీఫ్ జగన్.. పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా వ్యవస్థీకృత నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధ్యక్షులతో సమావేశం అయ్యారు. వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. కమిటీల నిర్మాణంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఇదే సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు గుప్పించారు.
పార్టీని మూడు విడతలుగా బలపర్చాలని జగన్ అధ్యక్షులకు సూచించారు. మే నాటికి మండల కమిటీలు, జూన్ నుంచి జూలై వరకు గ్రామ, మున్సిపల్ డివిజన్ కమిటీలు, ఆగస్టు నుంచి అక్టోబరు వరకు బూత్ కమిటీలు పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. కమిటీలు పూర్తి చేయడం ద్వారా పార్టీకి సమర్థవంతమైన యంత్రాంగం సిద్ధమవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో 1500 మంది, రాష్ట్రవ్యాప్తంగా 12 వేల మంది పార్టీ కార్యక్రమాలకు అందుబాటులో ఉంటారని చెప్పారు.
జిల్లా అధ్యక్షులు ఓనర్షిప్ చూపించాలని జగన్ సూచించారు. ప్రజలకు సంబంధించిన అంశాల్లో పార్టీ చెప్పేవరకు ఆగొద్దని.. నియోజకవర్గ ఇన్ఛార్జిలతో కలిసి ముందుకు కదలాలని సూచించారు. ప్రతి సమస్యలోనూ బాధితులకు తోడుగా ఉండాలని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షులు చేసే పని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలని దిశానిర్దేశం చేశారు.
'ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది. భారీ లక్ష్యాలు ఉన్నప్పుడే బ్యాట్స్మన్ మెరిసిపోతాడు. అందరూ ధోనిలా తయారవ్వాలి. అప్పుడే జిల్లాల్లో ఏడుకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలవగలుగుతాం. రైతులు మద్దతు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాల్లో రైతుల పక్షాన పోరాటాలు చేయాలి. రైతులకు అండగా ఉండాలి. వారి డిమాండ్లపై గళమెత్తాలి' అని అని జిల్లా అధ్యక్షులకు జగన్ సూచించారు.
ప్రభుత్వంపైనా జగన్ విమర్శలు గుప్పించారు. 'చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విద్య, వైద్యం, వ్యవసాయం అన్నిరంగాల్లోనూ విధ్వంసమే జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో రాజ్యమేలుతోంది. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మనపై ఉంది. సహజంగా రెండు మూడేళ్లు అయ్యాక ప్రభుత్వ వ్యతిరేకత బయటపడదని. కానీ ఏడాదిలోపే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా వచ్చింది' అని జగన్ వ్యాఖ్యానించారు.
'యుద్ధ ప్రాతిపదికన కమిటీల ఏర్పాటును పూర్తి చేయాలి. కమిటీలు పూర్తిచేసి కలిసికట్టుగా పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహించి బలంగా నిలబడాలి. మనమంతా రాజకీయ నాయకులం. ఈ జీవితాన్ని ప్రజల కోసం పెట్టాం. బాధ్యతలు తీసుకోవాలి. అధికారాన్ని సాధించాలి. ప్రతిపక్షంలోనే మన నాయకత్వాన్ని నిరూపించాలి. అవకాశం అందరికీ రాదు. వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. పనిచేసిన వారికే పార్టీలో అవకాశాలు ఉంటాయి' అని జగన్ స్పష్టం చేశారు.
సంబంధిత కథనం