కోనసీమలో ఆంక్షల కొనసాగింపు..... ఇప్పట్లో ఇంటర్నెట్ కష్టమే....
జిల్లా పేరు మార్పుతో అట్టుడికిన కోనసీమ జిల్లాలో ఇంకా పరిస్థితులు సాధారణ స్థితికి రాలేదు. గత వారం కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో కోనసీమలో 144 సెక్షన్తో పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. వారం తర్వాత కూడా పునరుద్ధరించలేదు. మరో రెండు రోజుల పాటు కోనసీమలో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావని పోలీసులు స్పష్టం చేశారు.
కోనసీమలో మరో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ అందుబాటులోకి రాదు. వర్క్ ఫ్రం చేసే వారితో పాటు, ప్రజలు ఇంటర్నెట్ అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరికొన్ని రోజులు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురాకూడదని పోలీసులు భావిస్తున్నారు. ఎప్పటిలోగా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరిస్తారనే విషయాన్ని ప్రకటించకపోయినా, మరో రెండు రోజులు ఇంటర్నెట్ ఉండదని ఏలూరు రేంజ్ డిఐజి పాలరాజు స్పష్టంచేశారు. కోనసీమ ప్రాంతంలో అల్లర్లకు బాధ్యులైన వారిని గుర్తించే క్రమంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇంటర్నెట్ పునరుద్దరిస్తే మళ్లీ విద్వేష సమాచారాన్ని ఒకరికొకరు పంపుకుని అల్లర్లకు పాల్పడతారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
మరోవైపు పోలీసులకు వ్యతిరేకంగా కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. మే24 నాటి అల్లర్లకు కారణమైన వారిలో ఒకరిని లాకప్ డెత్ చేశారని వాట్సాప్లో ప్రచారం చేస్తున్నారని అలాంటి ఘటన ఎక్కడా జరగలేదని డిఐజి స్పష్టం చేశారు. కోనసీమలో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని ప్రజలు ఆందోళనకు గురవ్వొద్దని సూచిస్తున్నారు. ఘర్షణలు తలెత్తేలా వాట్సాప్ మెసేజీలు పంపుతున్న వారిని గుర్తించామని చెప్పారు. తన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఓ యువకుడు లాకప్ డెత్ చేశారంటూ మెసేజీలు పంపాడని వివరించారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తుండటంతో మరికొన్నాళ్ల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపి వేయనున్నట్లు స్పష్టం చేశారు.
టాపిక్