AP Govt GNU : ఏపీలో ఉన్నత విద్యకు మరో ముందడుగు, రూ.1300 కోట్ల పెట్టుబడులతో అంతర్జాతీయ యూనివర్సిటీ -మంత్రి లోకేశ్
AP Govt GNU Agreement : ఏపీలో అంతర్జాతీయ విద్యాసంస్థ అడుగుపెట్టనుంది. రూ.1300 కోట్ల పెట్టుబడులతో జీఎన్యూ సంస్థ ఉత్తరాంధ్రలో యూనివర్సిటీ స్థాపించడానికి ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యకు పెద్ద ముందడుగు పడిందని మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.
AP Govt GNU Agreement : ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ అడుగుపెట్టబోతుంది. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విద్యాసంస్థ స్థాపించడానికి జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మంత్రి లోకేశ్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.
ఉత్తరాంధ్రలో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ సమక్షంలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ (GNU)తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో జీఎన్యూ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందం మేరకు ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి జీఎన్యూ సుమారు రూ.1,300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందంతో 500 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని సమాచారం.
"ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యకు పెద్ద ముందడుగు పడింది. రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి నా సమక్షంలో జార్జియా నేషనల్ యూనివర్సిటీ (GNU) ఏపీ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ భాగస్వామ్యం ప్రపంచ విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తుంది, 500+ ఉద్యోగాలను సృష్టిస్తుంది. మా విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో సన్నద్ధం చేస్తుంది. ఏపీని ప్రపంచ విద్యా కేంద్రంగా మార్చాలనే మా నిబద్ధత గతంలో కంటే బలంగా ఉంది" - మంత్రి లోకేశ్
ఏపీ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య
జీఎన్యూతో ఒప్పందం ఏపీ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందించడంతోపాటు రాష్ట్ర విద్యారంగాన్ని ప్రపంచపటంలో నిలిపేందుకు సహాయపడుతుందని మంత్రి లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచడమే కాకుండా ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు ఏపీ విద్యార్థులకు అందుతాయన్నారు. రాష్ట్ర విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలన్న కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి, నిబద్ధతకు ఈ ఒప్పందం నిదర్శనమన్నారు.
ఏపీలో ఉన్నత విద్య ప్రమాణాలను మెరుగుపర్చడం, గ్లోబల్ ఎక్స్పోజర్, అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నూతన ఆవిష్కరణలు, పరిశోధనను ప్రోత్సహించడం... ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేశ్ వెల్లడించారు.
సంబంధిత కథనం