జూన్‌ 21న విశాఖలో అంతర్జాతీయ యోగ దినోత్సవం…నేటి నుంచి జూన్‌ 21 వరకు యోగ ఆంధ్ర కార్యక్రమాలకు శ్రీకారం-internation yoga day on june 21st in visakhapatnam rk beach ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  జూన్‌ 21న విశాఖలో అంతర్జాతీయ యోగ దినోత్సవం…నేటి నుంచి జూన్‌ 21 వరకు యోగ ఆంధ్ర కార్యక్రమాలకు శ్రీకారం

జూన్‌ 21న విశాఖలో అంతర్జాతీయ యోగ దినోత్సవం…నేటి నుంచి జూన్‌ 21 వరకు యోగ ఆంధ్ర కార్యక్రమాలకు శ్రీకారం

Sarath Chandra.B HT Telugu

జూన్‌ 21న ఏపీలో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా విశాఖలో ఐదు లక్షల మందితో ప్రపంచ రికార్డు నెలకొల్పే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని,ఆర్కే బీచ్‌ నుంచి బోగాపురం వరకు లక్షలాది మందితో రికార్డు నెలకొల్పనున్నట్టు ప్రకటించారు.

జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహణ

ఏపీలో జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించడంతో పాటు ప్రపంచ రికార్డు నెలకొల్పే కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

విశాఖ ఆర్కే బీచ్‌ సముద్ర తీరంలో ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఆర్కే బీచ్‌ నుంచి బోగాపురం వరకు లక్షలాది మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పుతారు. ప్రపంచ యోగా దినోత్సవానికి ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో నెల రోజుల పాటు యోగ ఆంధ్రా కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రారంభించింది.

నెల రోజుల్లో 2లక్షల మందికి యోగలో సర్టిఫికెట్‌ పొందే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. జూన్ 21న ఐదు లక్షల మందితో విశాఖ సముద్ర తీరంలో ఆర్కే బీచ్‌ ఒడ్డున యోగాసానాలు చేపడతారని ఉదయం 7 నుంచి 8 మధ్యలో ప్రపంచ రికార్డ్‌ నెలకొల్పే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆర్ట్ ఆఫ్‌ లివింగ్, బ్రహ్మకుమారి, ఈషా, పతంజలి సంస్థలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాయని చంద్రబాబు చెప్పారు.

మే 21 నుంచి జూన్‌ 21 వరకు యోగ ఆంధ్ర కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 10వ ఇంటర్నేషనల్‌ యోగా దినోత్సవం నిర్వహణకు ఏపీ వేదిక కానుందని చంద్రబాబు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఈవెంట్‌కు ఏపీ అతిథ్యం ఇవ్వనుంది.

యోగాకు ప్రపంచ వ్యాప్తంగా నరేంద్ర మోదీ గుర్తింపు తెచ్చారని, భారత వారసత్వంగా వచ్చిన యోగకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిందని చెప్పారు. దాడులు, పరపాలనతో భారతీయ నాగరికత కనుమరుగైందని, వాటికి పునర్‌వైభవం తెచ్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

ఇంటర్నేషనల్‌ యోగా దినోత్సవాన్ని 2014 డిసెంబర్‌లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అమోదంతో అమల్లోకి వచ్చిందని, ఇప్పుడు యోగ దినోత్సవం అంతర్జాతీయ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, 2025లో యోగా ఫర్ వన్‌ ఎర్త్‌ వన్ హెల్త్‌ థీమ్‌తో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాల సాధన కోసం యోగను తమ జీవితంలో భాగం చేసుకోవాల్సి ఉందన్నారు. టెక్నాలజీతో టెన్షన్, స్ట్రెస్‌ పెరిగి, జీవితం మెకానికల్‌ అయిపోతుందని వాటికి యోగా చక్కని పరిష్కారం చూపిస్తుందన్నారు.

జీవన శైలి సమస్యలకు యోగా పరిష్కార మార్గం అవుతుందని, యోగాను పెద్ద ఎత్తున ప్రజల జీవితాల్లో భాగం చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. యోగను ప్రమోట్ చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కనీసం రెండు కోట్ల మంది యోగా దినోత్సవంలో భాగం అయ్యేలా ప్రజలంతా కృషి చేయాలన్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం