ఏపీలో ఐపీఎస్‌ అధికారులకు కలిసి రాని ఇంటెలిజెన్స్‌ పోస్టింగ్.. నాడు ఏబీ.. నేడు పిఎస్సార్‌..-intelligence posting seems unlucky for ips officers in ap once ab now psr ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీలో ఐపీఎస్‌ అధికారులకు కలిసి రాని ఇంటెలిజెన్స్‌ పోస్టింగ్.. నాడు ఏబీ.. నేడు పిఎస్సార్‌..

ఏపీలో ఐపీఎస్‌ అధికారులకు కలిసి రాని ఇంటెలిజెన్స్‌ పోస్టింగ్.. నాడు ఏబీ.. నేడు పిఎస్సార్‌..

Sarath Chandra.B HT Telugu

ఏపీలో ఐపీఎస్‌ అధికారులకు ఇంటెలిజెన్స్‌ బాధ్యతలు కలిసి రానట్టు కనిపిస్తోంది.గత పదేళ్లలో ఇంటెలిజెన్స్ బాధ్యతలు చూసిన ఇద్దరు టాప్‌ ఐపీఎస్‌ ఆఫీసర్లు తర్వాతి కాలంలో చిక్కులో పడటం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఐదేళ్లు పోస్టింగ్‌ లేకుండా గడిపితే, తాజాగా పిఎస్సార్ జైలుకు వెళ్లారు.

ఏపీలో ఇంటెలిజెన్స్ బాధ్యతలు ఐపీఎస్‌లకు కలిసి రావడం లేదా?

ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ అధికారులకు ఇంటెలిజెన్స్ బాధ్యతలు పెద్దగా అచ్చి రావడం లేదు. గత పదేళ్లలో ప్రభుత్వాలకు కళ్లు, చెవులుగా పనిచేసిన ఇద్దరు డీజీ స్థాయి అధికారులు తర్వాతి కాలంలో చిక్కుల్లో పడ్డారు. 2014-19 మధ్య కాలంలో ఇంటెలిజెన్స్ బాధ్యతలు చూసిన ఏబీ వెంకటేశ్వరావు వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు గురైతే, 2019-24 మధ్య కాలంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన పిఎస్సార్ ఆంజనేయులు ఏకంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

ఏపీలో రాజకీయాలకు ప్రభుత్వ అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వాలను నడిపించే నేతల ఆదేశాలను తూచ తప్పకుండా పాటించడమే వారికి శాపంగా మారుతోందనే విమర్శలు ఉన్నాయి. గత పదేళ్లలో ఇద్దరు డీజీ స్థాయి అధికారులు ఎదుర్కొన్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన నగరాల్లో విజయవాడ పోలీస్ కమిషనరేట్‌ ఒకటి. హైదరాబాద్‌ తర్వాత కమిషనరేట్‌ హోదా పొందిన విజయవాడ నగరంలో పనిచేయడం ఐపీఎస్ అధికారులు గుర్తింపుగా భావించేవారు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ సీపీలుగా పనిచేసిన ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు ఇంటెలిజెన్స్ చీఫ్‌లు అయ్యారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావు..

రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఏపీలో పాలన మొదలైంది. 2014లో తొలి ఏడాది పాలనలో కుదురుకోడానికి, రాజధాని నగరాన్ని ఎంపిక చేసుకోవడంలోనే కాలం గడిచి పోయింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ పాలనా యంత్రాంగం మొత్తం హైదరాబాద్‌ నుంచి నడిచేది.

విజయవాడలో సీఎం చంద్రబాబు తాత్కాలిక బస ఏర్పాటు చేసుకోడానికి కూడా ఏడెనిమిది నెలల సమయం పట్టింది. ఇరిగేషన్‌ శాఖకు చెందిన పులిచింతల ఎస్‌ఈ కార్యాలయాన్ని దశల వారీగా సిఎం క్యాంపు ఆఫీసుగా మార్చుకున్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ బాధ్యతలు ఐపీఎస్ అధికారి ఏఆర్‌ అనురాధ పర్యవేక్షించేవారు.

అనూహ్యంగా ఇంటెలిజెన్స్ బాధ్యతలు…

2015 మే నెలలో హైదరాబాద్‌లో జరిగిన రాజకీయ పరిణామాలతో టీడీపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘటనలు ఏపీ, తెలంగాణల మధ్య రాజకీయంగా తీవ్రమైన ఒత్తిడికి కారణమైంది.అదే ఏడాది జులైలో అనురాధను ఇంటెలిజెన్స్‌ బాధ్యతల నుంచి తప్పించారు. ఆ సమయంలోనే విజయవాడ సీపీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు ఇంటెలిజెన్స్‌ బాధ్యతలు అప్పగించారు.

విజయవాడ సీపీగా గౌతమ్‌ సవాంగ్‌ను నియమించారు. ఏబీ వెంకటేశ్వరరావు ఆ తర్వాత 2019 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిఘా విభాగంలో అక్రమాలు జరిగాయంటూ ఆయనపై వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు పడింది. ఆయనపై పలు అభియోగాలు నమోదు చేశారు.

వైసీపీ అధికారంలోక వచ్చిన తర్వాత అంతకు ముందు ప్రభుత్వంలో వైసీపీకి వ్యతిరేకంగా జరిగిన పరిణామాలకు ఆయన్ని బాధ్యుడిని చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 2014-19 మధ్య కాలంలోగా చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులంతా జగన్‌ హయంలో కీలక బాధ్యతలు దక్కించుకున్నారు. సిఎంఓ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సతీష్‌ చంద్ర వంటి అధికారులకు కూడా కీలక పోస్టింగులు దక్కాయి. ఏబీ వెంకటేశ్వరరావు మాత్రం పోస్టింగ్ కోసం వైసీపీ నాయకుల వద్దకు వెళ్లాలని సన్నిహితులు సూచించినా తాను వెళ్లలేదని చెప్పేవారు.

నాలుగున్నరేళ్లు పోస్టింగ్ లేకుండా…

ఈ క్రమంలోనే ఏబీ వెంకటేశ్వరరావు దాదాపు నాలుగున్నరేళ్ల పాటు ఎలాంటి పోస్టింగ్ లేకుండా ఉండాల్సి వచ్చింది. 2019-24 మధ్య కాలంలో పోస్టింగ్ కోసం హైకోర్టు, సుప్రీం కోర్టులలో న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. ఉన్నత పోస్టింగ్‌లో ఉండాల్సిన అధికారి చివరి క్షణం వరకు పోస్టింగ్ కోసం పోరాడారు. చివరకు కోర్టు ఆదేశాలతో చివరి రోజు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో పదవీ విరమణ చేయాల్సి వచ్చింది.

టీడీపీ హయంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడానికి ఏబీ వెంకటేశ్వరరావు కారణమనేది వైసీపీ వర్గాల ఆరోపణ. రాజకీయ నిర్ణయాలతో తనకు సంబంధం లేదని ఆయన పలు సందర్భాల్లో ప్రకటించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ‍యనకు ప్రాధాన్యత లభిస్తుందని భావించినా ప్రభుత్వం ఇచ్చిన పోస్టింగ్‌ స్వీకరించలేదు. ఇటీవల రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు.

పిఎస్సార్ ఆంజనేయులుది అదే తీరు...

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట్లో కొద్ది నెలల పాటు తెలంగాణ క్యాడర్‌కు చెందిన స్టీఫెన్ రవీంద్ర ఏపీ ఇంటెలిజెన్స్ బాధ్యతలు ఇవ్వాలని జగన్ భావించారు. స్టీఫెన్‌ బదిలీకి కేంద్ర ప్రభుత్వం నుంచి అమోదం లభించకపోవడం, తెలంగాణలో తగినంత క్యాడర్‌ స్ట్రెంగ్త్ లేకపోవడంతో ఆయన డిప్యూటేషన్‌కు కేంద్రం అనుమతించలేదు.

2019 ఎన్నికల సమయంలో ఈసీ ఆదేశాలతో ఏబీ వెంకటేశ్వరరావును తప్పించి మనీష్ కుమార్ సిన్హాకు ఇంటెలిజెన్స్‌ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత స్టీఫెన్‌ రవీంద్ర డిప్యూటేషన్‌ రాకపోవడంతో నిఘా విభాగం బాధ్యతలు తాత్కలికంగా ఇతరులకు అప్పగించారు. ఆ తర్వాత పిఎస్సార్‌ ఆంజనేయులుకు అవకాశం లభించింది. ఏపీపీఎస్సీ బాధ్యతలతో పాటు ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని కూడా పర్యవేక్షించారు.

అప్పట్లో అనూహ్య బదిలీ…

పిఎస్సార్‌ ఆంజనేయులు గతంలో 2010-11లో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. అప్పట్లో నాటకీయ పరిణామాల మధ్య విజయవాడ సీపీ బాధ్యతల నుంచి ఆయన్ని తప్పించారు. దీంతో ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. టీడీపీ నాయకుడు వల్లభనేని వంశీతో తలెత్తిన వివాదాలు చివరకు ఆయన బదిలీకి కారణం అయ్యాయి.

అప్పట్లో టీడీపీ నగర అధ్యక్షుడిగా ఉన్న వంశీ వాహనాల కాన్వాయ్‌తో నగరంలో తిరిగే వారు. కాంగ్రెస్‌ నాయకుడు దేవినేని నెహ్రూకు, వంశీకి రాజకీయ విభేదాలు ఉన్నాయి. టీడీపీలో దేవినేని ఉమా వర్గంతో పడేది కాదు. ఈ క్రమంలో వంశీ కాన్వాయ్‌లో షికార్లకు పిఎస్సార్ బ్రేకులు వేశారు. ఆ తర్వాత కమిషనరేట్‌లో వంశీని కౌన్సిలింగ్‌కు పిలిపించడం చర్చనీయాంశం అయ్యింది.

ఈ వివాదాల నడుమ ఓ మహిళా డాక్టర్‌ అంశం తెరపైకి వచ్చింది. పిఎస్సార్‌ ఆంజనేయులు మహిళను వేధిస్తున్నారంటూ వల్లభనేని వంశీ వ్యక్తిగత ఆరోపణలు చేయడం,మీడియాలో పెద్ద ఎత్తున వాటిని హైలైట్ చేయడంతో పిఎస్సార్‌ను అప్పటి ప్రభుత్వం బదిలీ చేసింది.

జగన్‌ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు…

ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిఎస్సార్ ఆంజనేయులు అనూహ్యంగా ప్రాధాన్యత పెరిగింది. వైసీపీ నాయకుల ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేశారంటూ టీడీపీ పలు సందర్భాల్లో ఆరోపించింది. టీడీపీ నేతలపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం వెనుక పిఎస్సార్‌ ఉన్నాడని ఆ పార్టీ భావించింది.

ఈ క్రమంలో ముంబైకు చెందిన సినీ నటి కాందబరి జెత్వాని వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదే కేసులో విజయవాడ సీపీ కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణలపై కూడా కేసు నమోదైంది. ఈ కేసులో పిఎస్సార్‌ మినహా మిగిలిన వారంతా ముందస్తు బెయిల్ పొందారు. జెత్వానీ వ్యవ‍హారంలో తాను ఏ తప్పు చేయలేదని పిఎస్సార్‌ చెబుతూ వచ్చారు. అరెస్టైన తర్వాత కూడా కోర్టులో ఇదే వాదించారు. కేసుల విచారణలో తన ప్రమేయం లేదని, తనను ఇరికించారని ఆరోపించారు.

పాలక పార్టీలకు టార్గెట్‌లవుతున్నారు…

ప్రభుత్వాలను నడిపే పాలక పార్టీలు రాష్ట్రంలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుంటుంది. ఈ క్రమంలో రాజకీయ కక్ష సాధింపులకు అదే ఇంటెలిజెన్స్ విభాగాన్ని బాధ్యుల్ని చేసే ధోరణి ఏపీలో కొనసాగుతోంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్‌ బాధ్యతలు తమకొద్దని ఐపీఎస్‌లు తప్పుకునే వాతావరణం ఏపీలో వచ్చేసిందని పోలీస్ అధికారులు చెబుతున్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం