Indian Coast Guard : భారత జలాల్లోకి 11 మంది శ్రీలంక మత్స్యకారులు
Indian Coast Guard : భారత జలాల్లోకి శ్రీలంక మత్స్యకారులు ప్రవేశించారు. గస్తీ నిర్వహిస్తున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు వారిని పట్టుకున్నారు.
బంగాళాఖాతం(bay of bengal)లో గస్తీ నిర్వహిస్తున్న ఇండియన్ కోస్ట్ గార్డ్(Indian Coast Guard) అధికారులు రెండు శ్రీలంక ఫిషింగ్ బోట్(Sri Lanka Fishing Boats)లతో పాటు ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఫిషింగ్ చేస్తున్న 11 మంది శ్రీలంక మత్స్యకారులను పట్టుకున్నారు. విచారణ కోసం కాకినాడకు తీసుకెళ్లారు.
ట్రెండింగ్ వార్తలు
శ్రీలంక బోట్లను శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం నుండి 175 నాటికల్ మైళ్ల దూరంలో భారత ఈఈజెడ్(EEZ)లో సరైన లైసెన్స్లు, పత్రాలు లేకుండా చేపల వేటలో నిమగ్నమై ఉన్నందున పట్టుకున్నారు. మారిటైమ్ జోన్స్ ఇండియా యాక్ట్ 1981 ప్రకారం, భారతీయ ఈఈజెడ్లో విదేశీ నౌకలు చేపలు పట్టడం, వేటాడటం నేరం, దీని ద్వారా శ్రీలంక ఫిషింగ్ ఓడ చట్టాన్ని, ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాన్ని(UNCLOS) ఉల్లంఘించిన నేరంగా భావిస్తారు.
కాకినాడ(Kakinada)లో మెరైన్ పోలీసులు, మత్స్య శాఖ, కస్టమ్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఫిషింగ్ బోట్లు(Fishing Boats), సిబ్బందిని తదుపరి చర్యల కోసం మెరైన్ ఫిషరీస్ డిపార్ట్మెంట్, మెరైన్ పోలీసులకు అప్పగించారు.
నవంబర్ 10వ తేదీన బంగాళాఖాతంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది భారత జలాల్లో ఫిషింగ్ చేస్తున్న రెండు బోట్లతోపాటుగా 11 మంది శ్రీలంక మత్స్యకారులను(Sri Lanka Fishermen) పట్టుకున్నారు. 300 కిలోల చేపలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మత్స్యకారులను, రెండు బోట్లను తమకు అప్పగించినట్టుగా కాకినాడ మెరైన్ పోలీసులు తెలిపారు.
వారిని విచారణ చేస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్న చేపలను వేలం వేసినట్టుగా తెలిపారు. అయితే చేపలు పట్టుకునేందుకు వచ్చి.. రూట్ మిస్ అయ్యామని శీలంక(Sri Lanka) మత్స్యకారులు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. భారత జలాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో సంబంధిత సెక్షన్ల కింద చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే వారి గురించి చెన్నై(Chennai)లోని శ్రీలంక ఎంబసీకి అధికారులు సమాచారం ఇచ్చారు. న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. రెండు బోట్లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
సంబంధిత కథనం