IMD Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం… ఏపీకి వర్ష సూచన!
Low Pressure in Bay Of Bengal: ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. ఇవాళ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి.
Weather Updates of Andhrapradesh:మాండూస్ తుపాన్ దాటికి ఏపీలో విస్తృత వర్షాలు కురిశాయి. ఈ ప్రభావం పూర్తి కాకముందే మరో అల్పపీడనం వచ్చేసింది. ఫలితంగా మరికొన్ని రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడగా.. అది కాస్త ఇవాళ తీవ్ర అల్పపీడనంగా మారనుందని వెల్లడించింది. ఈ ప్రభావం 17వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేసింది.
ట్రెండింగ్ వార్తలు
అల్పపీడనం ఎఫెక్ట్ తో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆపై మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని ఐఎండీ పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
మాండూస్ తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవటంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో కల్లాల్లో ఉండే ధాన్యం రాశులు చుట్టూ వర్షం నీరు చేరడంతో రైతులు ఆందోళనలో పడుతున్నారు. పరదాలు కప్పినప్పటికీ అడుగు భాగాన నీరు చేరి ధాన్యం తడవడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. అకాల వర్షాలతో అపార నష్టం కలుగుతుందని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి తడిసిన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలని పలువురు రైతులు కోరుతున్నారు.
మరోవైపు తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురిశాయి. మాండూస్ తుపాన్ ప్రభావంతో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. పలుచోట్ల వర్షం పడి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షం కారణంగా కోనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసి ముద్ద కావటంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.