పాస్టర్ ప్రవీణ్ మృతిపై రాజమండ్రిలో పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఐజీ అశోక్ కుమార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీతో కలిసి వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారని స్పష్టం చేశారు. అందుకు తగ్గ ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఇకపై దీని గురించి ఎవరూ సోషల్ మీడియాలో తప్పుగా పోస్టులు చేయొద్దని సూచించారు.
'పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టాం. ప్రవీణ్ దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారు. పలువురు సాక్షులను ప్రశ్నించి సమాచారం రాబట్టాం. ప్రవీణ్కు సంబంధించి పలుచోట్ల సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాం. ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదు. పోలీసుల దర్యాప్తుపై నమ్మకం ఉందని ప్రవీణ్ కుటుంబసభ్యులు చెప్పారు' అని ఐజీ అశోక్ కుమార్ వివరించారు.
'సోషల్ మీడియాలో మాట్లాడినవారు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. సోషల్ మీడియాలో చేసినవన్నీ నిరాధార ఆరోపణలే. దారిలో ప్రవీణ్ హైదరాబాద్, కోదాడ, ఏలూరులో మద్యం షాపులకు వెళ్లారు. దారిలోనే ప్రవీణ్కు మూడుసార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి. జగ్గయ్యపేట వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. కీసర టోల్ ప్లాజా వద్ద అదుపు తప్పి ప్రవీణ్ కింద పడిపోయారు. కీసర వద్ద ప్రవీణ్కు సాయం చేసేందుకు అంబులెన్స్, వైద్య సిబ్బంది వెళ్లారు' అని ఐజీ చెప్పారు.
'గుంటుపల్లి దగ్గర పాస్టర్ ప్రవీణ్ కాసేపు ఆగారు. బంకులోకి వచ్చేటప్పటికే బండిపై నుంచి లగేజ్ పక్కకు ఒరిగిపోయింది. రామవరప్పాడు జంక్షన్ వద్ద ప్రవీణ్ కండిషన్ను ఆటోడ్రైవర్ చూశారు. ట్రాఫిక్ ఎస్ఐ సూచనతో పార్కులో రెండు గంటలు నిద్రపోయారు. కండిషన్ బాగాలేదు, వెళ్లవద్దని చెప్పినా ప్రవీణ్ ముందుకెళ్లారు. హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ సైడ్ బ్లింకర్ వేసుకునే ప్రయాణించారు' అని అశోక్ కుమార్ వివరించారు.
'ఏలూరులో మూడోసారి పాస్టర్ ప్రవీణ్ మద్యం కొనుగోలు చేశారు. మద్యం షాపునకు వచ్చినప్పటికే ప్రవీణ్ కళ్లజోడు పగిలిపోయింది. కొంతమూరు పైవంతెనపై కూడా పాస్టర్ ప్రవీణ్ వేగంగా వెళ్లారు. ప్రమాదస్థలంలో ప్రవీణ్ బుల్లెట్ రోడ్డు పక్కకు దూసుకుపోయింది. పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్ను ఏ వాహనం ఢీకొనలేదు. ప్రవీణ్ బుల్లెట్కు, పక్కన వెళ్తున్న కారుకు గ్యాప్ చాలా ఉంది. ప్రమాద స్థలంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి. కంకర రాళ్లు ఉన్నాయి' అని ఐజీ వెల్లడించారు.
'బుల్లెట్ పైకి ఎగిరి పాస్టర్ ప్రవీణ్పై పడిందని ఫోరెన్సిక్ నివేదిక చెప్పింది. ప్రమాదం జరిగినప్పుడు బండి ఫోర్త్ గేర్లో ఉందని చెప్పారు. ఇతర వాహనాలు ఢీకొనలేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు. ప్రవీణ్ దారిలో ఆరుసార్లు యూపీఐ పేమెంట్లు చేశారు. ప్రవీణ్ శరీరంలో మద్యం ఉందని ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పింది' అని ఐజీ అశోక్ కుమార్ వివరించారు.
సంబంధిత కథనం