హైదరాబాద్‌కు వచ్చే రూట్లన్నీ బిజీబిజీ.. ఇటు విజయవాడ, అటు వరంగల్ హైవేలపై ట్రాఫిక్!-hyderabad routes are busy with traffic on both vijayawada and warangal highways after dasara ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  హైదరాబాద్‌కు వచ్చే రూట్లన్నీ బిజీబిజీ.. ఇటు విజయవాడ, అటు వరంగల్ హైవేలపై ట్రాఫిక్!

హైదరాబాద్‌కు వచ్చే రూట్లన్నీ బిజీబిజీ.. ఇటు విజయవాడ, అటు వరంగల్ హైవేలపై ట్రాఫిక్!

Anand Sai HT Telugu

హైదరాబాద్ వైపు వచ్చే రహదారులన్నీ బిజీబిజీగా ఉన్నాయి. కొన్ని ప్రదేశాల్లో ట్రాఫిక్ జామ్‌తో మెల్లగా కదులుతున్నాయి.

భారీగా ట్రాఫిక్

దసరా సెలవుల తర్వాత వేలాది మంది తమ స్వస్థలాల నుండి హైదరాబాద్ నగరానికి తిరిగి వస్తుండటంతో హైదరాబాద్‌కు వచ్చే రహదారులపై తీవ్ర ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ఆదివారం మాత్రమే ఉంటుందని అనుకున్నారు చాలా మంది. కానీ సోమవారం కూడా చాలా మంది ఊర్ల నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఇటు విజయవాడ-హైదరాబాద్, అటు వరంగల్-హైదరాబాద్, ఇంకోవైపు కరీంనగర్-హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలతో రద్దీ నెలకొంది.

సోమవారం పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరవడంతో రద్దీ నెలకొంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంది. చౌటుప్పల్‌లో వాహనాలు అనేక కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. ఆదివారం అయితే తెల్లవారుజామున ప్రారంభమైన రద్దీ అర్ధరాత్రి దాటినా కొనసాగింది, హైదరాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్ అత్యంత తీవ్ర జామ్‌ ఉంది.

ట్రాఫిక్‌ను సులభతరం చేయడానికి పోలీసు సిబ్బందిని పెద్ద సంఖ్యలో మోహరించారు. తిరిగి భాగ్యనగరానికి వస్తున్న ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో పరిస్థితిని నిర్వహించడం కష్టమైంది. నల్లగొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు వాహనాలు భారీగా నిలిచిపోయినాయి.

ఎల్బీనగర్‌ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వాహనాలు కదలకపోవడంతో మెట్రో రైలును ఆశ్రయించారు జనాలు. దీంతో మెట్రో కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. మెట్రో సిబ్బంది ప్రయాణికులను క్యూ పద్ధతిలో పంపించారు. పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో చాలా ఎల్బీ నగర్‌లో క్యూ లైన్ నుంచి ఫ్లాట్ ఫారం చేరుకునేందుకు చాలా సమయం పట్టింది.

వరంగల్-హైదరాబాద్ హైవేపై కూడా ఇలాంటి దృశ్యమే కనిపించింది, బీబీనగర్ సమీపంలో, టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ జాబ్ ఎక్కువగా అయింది. టోల్ గేట్ల దగ్గర ఎక్కువగా వాహనాలు రద్దీ ఉంటుంది. దసరా తర్వాత అందరూ సొంత ఊర్ల నుంచి వస్తుండటంతో తెలంగాణ అంతటా రహదారులు రద్దీగా ఉన్నాయి. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.