గ్రూప్‌ 2 శిక్షణకు హైదరాబాద్‌ వెళ్లి.. ఉగ్రవాదం వైపు మళ్లిన విజయనగరం యువకుడు… బాంబు పేలుళ్లకు కుట్ర-hyderabad group 2 training leads to arrest of vizianagaram youth in terror activities ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  గ్రూప్‌ 2 శిక్షణకు హైదరాబాద్‌ వెళ్లి.. ఉగ్రవాదం వైపు మళ్లిన విజయనగరం యువకుడు… బాంబు పేలుళ్లకు కుట్ర

గ్రూప్‌ 2 శిక్షణకు హైదరాబాద్‌ వెళ్లి.. ఉగ్రవాదం వైపు మళ్లిన విజయనగరం యువకుడు… బాంబు పేలుళ్లకు కుట్ర

Sarath Chandra.B HT Telugu

తండ్రి, సోదరుడి మాదిరి ప్రభుత్వ ఉద్యోగాల స్థిరపడతాడని హైదరాబాద్‌లో గ్రూప్ 2 పరీక్షల శిక్షణకు పంపిస్తే ఉగ్రవాదం వైపు ఆకర్షితుడై కటకటాల పాలయ్యాడు.హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన విజయనగరం జిల్లా యువకుడి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన యువకుల అరెస్ట్‌

విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అతని తండ్రి పోలీస్ శాఖలో ఏఎస్సైగా పనిచేస్తున్నాడు. అతని సోదరుడు కూడా అదే డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాడు.తండ్రి సోదరుడి బాటలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరతాడని కుటుంబ సభ్యులు భావించారు.

ఉద్యోగ ప్రయత్నాలతో పాటు గ్రూప్‌ 2 పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు శిక్షణ కోసం కుటుంబ సభ్యులు సిరాజ్‌ను హైదరాబాద్‌ పంపించారు. ఆన్‌లైన్‌లో ఉగ్రవాద ప్రచారాలకు ఆకర్షితుడైన సిరాజ్‌ హైదరాబాద్‌కు చెందిన మరో యువకుడితో కలిసి ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించాడు. సౌదీ నుంచి ఐసిస్‌ మార్గదర్శకాలతో అలజడి సృష్టించేందుకు బాంబుల తయారీ మొదలు పెట్టాడు.

ఆన్‌లైన్‌లో ప్రేరణ పొంది…

విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్‌, సికింద్రాబాద్‌ బోయిగూడకు చెందిన చెందిన సయ్యద్ సమీర్‌లను ఉగ్రవాద కార్యకలాపాలపై పోలీసులు అరెస్ట్ చేశారు. సిరాజ్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. గ్రూప్‌ 2 పరీక్షల కోసం హైదరాబాద్‌ వెళ్లాడు.

ఆన్‌లైన్‌ వేదికల్లో ఉగ్రవాద ప్రచారాలతో ప్రేరణ పొందారు. అల్ హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పేరిట సంస్థను ఏర్పాటు చేసి కార్య కలాపాలు సాగించారు. సిరాజ్‌ ఈ సంస్థను ఏర్పాటు చేస్తే సమీర్‌ దానిలో సభ్యుడయ్యాడు. వీరిద్దరికి సౌదీ అరేబియా నుంచి ఇంకా గుర్తించని ఉగ్రవాద సంస్థ హ్యాండ్లర్ ద్వారా దాడులు చేసేలా గైడ్ చేశాడు.

ఇన్‌స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఆన్‌లైన్‌ యువకులను ఆకర్షించి వారిని భారత్‌లో దాడులు చేసేలా ప్రోత్సహించాడు. ఉగ్ర దాడుల కోసం పొటాషియం క్లోరేట్, సల్ఫర్ వంటి పేలుడు పదార్ధాల రసాయనాలను ఆన్లైన్‌లో తెప్పించుకున్నాడు.

బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చి…

సౌదీకి చెందిన హ్యాండ్లర్ మ్యాజిక్‌లాంతర్‌ ద్వారా ఎంచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉగ్రవాదానికి అనుకూలంగా పోస్టులు పెట్టి వాటికి స్పందించే వారిని ఉగ్ర కార్యకలాపాలకు ఎంచుకుంటారు. అల్ హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పేరిట ఏర్పాటు చేసిన సంస్థలో మరో 28 మందిని చేర్చుకున్నారు.

అగ్గిపుల్లల్లోఉండే సల్ఫర్‌ వినియోగించి బాంబు తయారు చేసే విధానంపై హ్యాండ్లర్ వీరికి వీడియోలను పంపినట్లు తేలింది. వీటిని చూసి యువకులు రసాయనాలతో బాంబును తయారు చేశారు. ఒక బాంబును సిరాజ్ ఈ నెల 12న విజయనగరంలో ప్రయోగాత్మకంగా పరిశీలించాడు. మరో రెండు, మూడు రోజుల్లో తుది ప్రయోగాలు చేసేందుకు సిద్ధమయ్యాడు.

మే 21, 22 తేదీల్లో విజయనగరం పరిసరాల్లో బాంబుపేలుళ్లకు రిహార్సల్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ రసాయిన పదార్ధాలను కొనుగోలు చేయడంపై నిఘా వర్గాలకు సమాచారం అందడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు. నిందితులు ఏర్పాటు చేసిన సంస్థ ద్వారా యువకులు, మైనర్లతో తరచూ సమావేశాలు నిర్వహించారు.

గ్రూప్-2 శిక్షణకు పంపితే..

సిరాజ్‌ తండ్రి ఏఎస్సై, సోదరుడు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. కొడుకును ప్రభుత్వ ఉద్యోగంలో చేర్చాలని భావించి గ్రూప్‌ 2 పరీక్షల శిక్షణ కోసం హైదరాబాద్‌ పంపారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో పోస్టులతో ప్రేరణ పొందాడు. గ్రూప్‌ 2 కోచింగ్‌ పూర్తైన తర్వాత పరీక్షల కోసం విజయనగరం వచ్చేసినా హ్యాండ్లర్‌తో సంప్రదిస్తూనే ఉన్నాడు.

పేలుడు పదార్ధాల తయారీకి అవసరమైన పదార్ధాలను ఆన్‌లైన్‌లో తన ఇంటికి తెప్పించుకున్నాడు. వీరి కార్యకలాపాలపై నిఘా వర్గాలకు సమాచారం అందడంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు.. ఏపీ పోలీసులను ఆప్ర మత్తం చేశాయి. శనివారం విజయనగరంలో సిరాజ్ ఇంటిపై దాడి చేసి పేలుడు రసాయ నాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు సికింద్రాబాద్‌లో సమీర్‌ను అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారంట్‌పై విజయనగరం తరలించారు.

నిందితులకు రిమాండ్‌…

ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు.. కుట్రలు పన్నుతున్నారన్న అభియోగాలపై సిరాజ్‌, సమీర్‌లకు విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

కొడుకును ఉన్నత స్థానంలో చూడాలని భావించిన తండ్రికి అంతులేని దు:ఖాన్ని మిగిల్చాడు. పోలీస్‌ కస్టడీలోకి తీసుకుని నిందితుల్ని విచారించనున్నారు. నిందితులు ఎక్కడ పేలుళ్లకు పాల్పడాలనుకున్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

సిరాజ్‌ను సౌదీ నుంచి గైడ్‌ చేసిన హ్యాండ్లర్‌ను ఐసిస్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. అతని ఇన్‌స్టా ఖాతాలను గుర్తించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ వ్యవహారంపై ఎన్‌ఐఏ ఏపీ పోలీసుల నుంచి సమాచారం సేకరించింది. కేసుదర్యాప్తును ఎన్‌ఐఏ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం