visakhapatnam Crime : విశాఖపట్నంలో దారుణం.. నిండు గర్భిణిని హత్య చేసిన భర్త-husband kills pregnant woman in visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakhapatnam Crime : విశాఖపట్నంలో దారుణం.. నిండు గర్భిణిని హత్య చేసిన భర్త

visakhapatnam Crime : విశాఖపట్నంలో దారుణం.. నిండు గర్భిణిని హత్య చేసిన భర్త

visakhapatnam Crime : వారిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. కడదాక కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పిన భర్త.. కర్కశంగా వ్యవహరించాడు. నిండు గర్భిణి అనే కనికరం లేకుండా కాటికి పంపాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నంలోని మధరవాడలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అనూష, జ్ఞానేశ్వర్ (ఫైల్ ఫొటో)

విశాఖపట్నం మధురవాడలో నిండు గర్భిణి హత్యకు గురైంది. ఆర్టీసీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గెద్దాడ జ్ఞానేశ్వర్ రావు, ఆయన భార్య అనూష (27) నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కిందట ప్రేమ వివాహం జరిగింది. ప్రస్తుతం అనూష 8 నెలల గర్భిణీ. ఇక్కడిదాకా జీవితం సాఫీగా సాగిపోతోంది. కానీ.. కారణం ఏంటో తెలియదు.. సోమవారం ఉదయం భార్యాభర్తల మధ్య ఇంట్లో గొడవ జరిగింది.

పీక నొక్కి..

ఈ క్రమంలో జ్ఞానేశ్వర్ రావు.. భార్య అనూష పీక పట్టుకుని గట్టిగా నొక్కాడు. ఆమె ఊపిరి అందక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే స్థానికుల సాయంతో భర్త ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. తర్వాత కేజీహెచ్‌కు తీసుకువెళ్లాడు. అప్పటికే అనూష మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తానే భార్యను చంపేశానని జ్ఞానేశ్వర్ ఒప్పుకున్నాడు. నిందితుడిని పీఎం పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కుటుంబ తగాదాలే కారణం..

ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పెద్దఎత్తున జనాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ తగాదాల వల్లే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. భార్యను చంపేసిన జ్ఞానేశ్వర్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయని.. స్థానికులు చెబుతున్నారు. ఇవాళ ఉదయం పూట కేకలు వినిపించాయని అంటున్నారు.

గొడవలుంటే.. ఇలా చేయాలి..

ఒకరితో ఒకరు స్పష్టంగా, గౌరవంగా మాట్లాడటం చాలా ముఖ్యం. మీ భావాలను, అవసరాలను శాంతంగా తెలియజేయండి. ఎదుటివారి మాటలను శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. ఒకరి అభిప్రాయాలను, భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇద్దరి నేపథ్యాలు, ఆలోచనలు వేర్వేరుగా ఉండవచ్చని గుర్తుంచుకోండి. ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా అవసరం. గొడవలు జరుగుతున్నప్పుడు కూడా వ్యక్తిగత దూషణలకు దిగకండి.. అని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఓపిక అవసరం..

సమస్యలను పరిష్కరించడానికి సమయం పట్టవచ్చు. ఒకరిపై ఒకరు ఓపిక చూపడం ముఖ్యం. ప్రతి విషయంలోనూ ఒకే అభిప్రాయం ఉండాలని లేదు. కొన్నిసార్లు ఒక అడుగు వెనక్కి తగ్గి రాజీ పడటం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. తప్పులు సహజం. ఒకరినొకరు క్షమించుకోవడం నేర్చుకోవడం వల్ల బంధం బలపడుతుంది. మీ భాగస్వామిలోని మంచిని చూడటానికి ప్రయత్నించండి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఒకరితో ఒకరు సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇది మీ బంధాన్ని బలపరుస్తుంది.. అని నిపుణులు చెబుతున్నారు.

కోపం వచ్చినప్పుడు..

అవసరమైతే, సంబంధాల నిపుణులు లేదా కౌన్సెలర్ల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. వారు మీ సమస్యలను పరిష్కరించడానికి సహాయం చేయగలరు. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా వదిలేయడం మంచిది. ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం వల్ల అనవసరమైన కలహాలు వస్తాయి. ఇంటి పనులు, ఇతర బాధ్యతలను ఇద్దరూ సమానంగా పంచుకోవడం వల్ల ఒకరిపై ఒకరికి ఒత్తిడి తగ్గుతుంది. గొడవలు కూడా తగ్గుతాయి. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా.. కాసేపు ఆగి శాంతంగా మాట్లాడటానికి ప్రయత్నించడం మంచిది.. అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం