ఏపీలో శుక్రవారం అల్లూరిసీతారామరాజు జిల్లా కూనవరం, చింతూరు మండలాల్లో వడగాలులు ప్రభావం ఉంటుంది. శనివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర వడగాలులు, 83 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.
శుక్రవారం శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది
ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
గురువారం నంద్యాల జిల్లా గోస్పాడు,రుద్రవరంలో 42.1డిగ్రీలు, వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో 41.5డిగ్రీలు, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 41.4డిగ్రీలు, కర్నూలులో 40.7డిగ్రీలు, చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 40.3డిగ్రీలు, అన్నమయ్య జిల్లా పుత్తనవారిపల్లెలో 40డిగ్రీలు చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 36 ప్రాంతాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు తెలిపారు.
భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎండతీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలి, గొడుగు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని అధికారులు సూచించారు.
సంబంధిత కథనం