Haidava Shankharavam : ఆ సినిమాలకు మార్కెట్ లేకుండా చేయాలి, కల్కి మూవీపై అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు-haindava sankharavam songs writer anantha sriram sensational comments on kalki moive ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Haidava Shankharavam : ఆ సినిమాలకు మార్కెట్ లేకుండా చేయాలి, కల్కి మూవీపై అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

Haidava Shankharavam : ఆ సినిమాలకు మార్కెట్ లేకుండా చేయాలి, కల్కి మూవీపై అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

Bandaru Satyaprasad HT Telugu
Jan 05, 2025 09:11 PM IST

Haidava Shankharavam : కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వీహెచ్పీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ కల్కి సినిమాపై సంచలన వ్యాఖ్యల చేశారు.

ఆ సినిమాలకు మార్కెట్ లేకుండా చేయాలి, కల్కి మూవీపై అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
ఆ సినిమాలకు మార్కెట్ లేకుండా చేయాలి, కల్కి మూవీపై అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

Haidava Shankharavam : కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సభలో పాల్గొన్న సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో పురాణాలను వక్రీకరిస్తున్నారన్నారు. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతుందన్నారు. కల్కి సినిమాపై అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో కర్ణుడి పాత్రను హైలెట్ చేశారన్నారు. కర్ణుడిని శూరుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ఆయన ప్రశ్నించారు. వీటిని చూసి సినీ రంగానికి చెందిన వ్యక్తిగా తాను సిగ్గు పడుతున్నట్లు చెప్పారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలకు మార్కెట్ లేకుండా చేయాలని అన్నారు. అలాంటి సినిమాలను ప్రభుత్వం బహిష్కరించడం కంటే ముందు మనమే తిరస్కరించాలన్నారు.

yearly horoscope entry point

వాల్మీకి రామాయణం, వ్యాస భారతం, భారత సాహిత్య వాజ్మయానికి రెండు కళ్లులాంటివని అనంత్ శ్రీరామ్ అన్నారు. అలాంటి వాటిని వినోదం కోసం వక్రీకరిస్తున్నారన్నారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను ప్రతి ఒక్కరూ బహిష్కరించాలన్నారు. ఆ సినిమాలకు డబ్బులు రావని, డబ్బులు రాకపోతే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను నిర్మాతలు ప్రోత్సహించరన్నారు. ఆలయాలకు ఆత్మగౌరవం కోసం హిందువులు భారీగా తరలిరావడం చాలా సంతోషం అన్నారు. సినీ పరిశ్రమలో జరిగే తప్పులను ఆ రంగానికి చెందిన వ్యక్తిగా బహిరంగంగానే విమర్శిస్తున్నానన్నారు. సినిమాల్లో జరిగిన హైందవ ధర్మ హననానికి హిందూ సమాజానికి క్షమాపణలు చెబుతున్నానన్నారు. చరిత్రను వక్రీకరించి హిందూ ధర్మాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

కేసరపల్లిలో హైందవ శంఖారావానికి వీహెచ్‌పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాష్ట్రంలోని 150 మంది స్వామీజీలు హైందవ శంఖారావంలో పాల్గొన్నారు. త్రిదండి చినజీయర్ స్వామి పాల్గొన్నారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి వచ్చే వరకు పోరాడతామని వీహెచ్‌పీ నేత గోకరాజు గంగరాజు అన్నారు. దేవాలయాలు దోపిడీకి గురవుతున్నాయన్నారు. సెక్యులరిజం పేరిట ఆలయాలను ప్రభుత్వాల గుప్పిట్లో పెట్టుకున్నాయని విమర్శించారు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి డిమాండ్ చేశారు. దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయాలకు రక్షణ కల్పించాలన్నారు. హిందూ ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం ఏమిటంటూ స్వామిజీలు ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మతాల్లో లేని విధంగా హిందూ దేవాలయాలపైనే ఎందుకు అని ప్రశ్నించారు. గుడి బయట చెప్పులు నుంచి దేవుడి దర్శనం వరకు అంతా వ్యాపారమేనని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి దర్శనం కోసం వెళ్తే జేబు గుల్ల అవుతుందని సామాన్య భక్తుడు ఆవేదన చెందుతున్నారన్నారు.

ఆలయాల ఆస్తులు, ఆచారాలు నాశనమైపోతున్నాయని త్రిదండి చినజీయర్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాలు బాగుంటేనే అందరం బాగుంటామన్నారు. దేవాలయాలకు గతంలో 15 లక్షల ఎకరాలు ఉండేవని, ఇప్పుడు ఇవి 4.50 లక్షల ఎకరాలకు వచ్చాయన్నారు. ఆలయాలకు సంబంధించిన నిర్ణయాలు కార్యాలయాల్లో కూర్చొని అధికారులు చేయాలా? అని ప్రశ్నించారు. హిందూ దేవాలయాలకు పూర్తి స్వయంప్రతిపత్తి కలిపిస్తూ చట్ట సవరణ చేయాలని స్వామీజీలు డిమాండ్ చేశారు. హిందు ఆలయాల ఆస్తులు, వ్యవస్థలపై దాడులు సరికాదన్నారు. అన్యాయంగా, చట్టవిరుద్ధంగా దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందూ పండుగలకు ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదన్నారు. హిందూ దేవాలయాల్లోని అన్య మత ఉద్యోగులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.

Whats_app_banner