Prakasam District : దివ్యాంగులకు ఉచితంగా ల్యాప్టాప్లు.. స్మార్ట్ ఫోన్లు.. ఇలా అప్లై చేసుకోండి
Prakasam District : దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వారికి ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు ఇవ్వనుంది. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వారి కార్యాలయాల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, మూడు చక్రాల సైకిళ్లు, వీల్ చైర్లు, చంక కర్రలు, వయో వృద్ధులకు వినికిడి యంత్రాలు అందివ్వనున్నట్టు.. ప్రకాశం జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి.అర్చన తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. దరఖాస్తుతో సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జత చేయాలని సూచించారు.

ఎవరు అర్హులు..
డిగ్రీ, ఆపై ఉన్నత చదువులు, టెక్నికల్ కోర్సులకు చదువుతున్న విద్యార్థులకు ల్యాప్టాప్ ఇవ్వనున్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన బదిర విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వనున్నారు. మిగతా వారికి మూడు చక్రాల సైకిల్, వీల్ చైర్, సంక కర్రలు, డైసీ ప్లేయర్, ఫోల్డింగ్ వాకింగ్ స్టిక్, వృద్ధుల చేతి కర్రలు కాలిపర్స్, వినికిడి యంత్రాలు ఇవ్వనున్నారు. వాటిని పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి.. జిల్లా దివ్యాంగు కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
ల్యాప్టాప్ల కోసం..
ల్యాప్టాప్లు పొందాలనుకునేవారు తప్పనిసరిగా డిగ్రీ, లేదా ఆపై చదువులు చదవాలి. అలాగే టెక్నికల్ కోర్సులు చదువుతున్న వారే అర్హులు. వారు తప్పనిసరిగా డిగ్రీ, ఆపై చదువులు, టెక్నికల్ కోర్సులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, పదో తరగతి సర్టిఫికెట్ సమర్పించాలి. దివ్యాంగు (సదరం) ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, కులం ధ్రువీకరిస్తూ తహశీల్దార్ ఇచ్చిన సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు జిరాక్స్, ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న కాలేజీ ధ్రువీకరణ పత్రం, రెండు పాస్పోర్టు సైజ్ ఫోటోలు దరఖాస్తు చేయడానికి అవసరం.
స్మార్ట్ ఫోన్ల కోసం..
స్మార్ట్ ఫోన్లను ఇంటర్మీడియట్ పూర్తి చేసిన బదిర విద్యార్థులకు ఇవ్వనున్నారు. తప్పనిసరిగా దివ్యాంగు (సదరం) ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. పదో తరగతి సర్టిఫికెట్, ఇంటర్మీడియేట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, కులం ధ్రువీకరిస్తూ తహశీల్దార్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు జిరాక్స్, రెండు పాస్పోర్టు సైజ్ ఫోటోలు ఉండాలి.
ఇతర పరికరాల కోసం..
మూడు చక్రాల సైకిల్, వీల్ చైర్, సంక కర్రలు, డైసీ ప్లేయర్, ఫోల్డింగ్ వాకింగ్ స్టిక్, వృద్ధుల చేతి కర్రలు కాలిపర్స్ పొందేందుకు.. కొన్ని ధ్రువీకరణ పత్రాలు అవసరం. దివ్యాంగు (సదరం) ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, కులం ధ్రువీకరిస్తూ తహశీల్దార్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు జిరాక్స్, రెండు పాస్పోర్టు సైజ్ ఫోటోలు ఉండాలి.
వినికిడి యంత్రాల కోసం..
చెవులు సరిగా వినబడకపోతే వినికిడి యంత్రాలు ఇస్తారు. ఇవి పొందాలంటే, దివ్యాంగు (సదరం) ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, కులం ధ్రువీకరిస్తూ తహశీల్దార్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు జిరాక్స్, ఆడియో గ్రామ్ ధ్రువీకరణ పత్రం, సివిల్ సర్జన్ ధ్రువీకరణ పత్రం, రెండు పాస్పోర్టు సైజ్ ఫోటోలు ఉండాలి.
మరింత సమచారం కోసం..
జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించి మరింత అదనపు సమాచారాన్ని పొందవచ్చు. ప్రకాశం జిల్లాకు చెందిన దివ్యాంగులు, వయో వృద్ధులైతే 08592-281310 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు. తన కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు దాఖలు వంటి అంశాలపై అదనపు సమాచారం పొందవచ్చని.. ప్రకాశం జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి.అర్చన వివరించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)