విశాఖలో గూగుల్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుందని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందన్నారు. ప్రపంచ డేటా అంత విశాఖ వస్తుంది, ఏఐ ఉత్పత్తులను తయారు చేసి ప్రపంచానికి అందించనున్నారన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా ఆంధ్రప్రదేశ్ మారనుందని తెలిపారు.
అమరావతి విట్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన మహాత్మాగాంధీ బ్లాక్ ,వి.వి.గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, అనంతపురం కేంద్రంగా, 5 జోన్స్ లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మన పిల్లలు ప్రపంచస్థాయి సేవలు అందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వాట్సాప్ సేవ ద్వారా ప్రజలకు పరిపాలన, ప్రభుత్వ సర్వీసులు దగ్గర చేశామన్నారు. వాట్సాప్ ద్వారా వెయ్యి రకాల సేవలు అందిస్తున్నామన్నారు.
"స్వర్ణాంధ్రప్రదేశ్ 2047కి మార్గం సుగుమం చేస్తున్నాం. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. త్వరలోనే అగ్రగామిగా నిలుస్తుంది. ఉగ్రదాడులు భారత్ను ఏం చేయలేవు. ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెబుతాం. సమైక్యంగా ఉండి దేశాన్ని రక్షించుకునే శక్తి మనకుంది" -సీఎం చంద్రబాబు
ప్రపంచ ఐటీ దిగ్గజం 'గూగుల్' విశాఖ రావడానికి మార్గం సుగమం అవుతోంది. ఇప్పటికే ఈ సంస్థకు అవసరమైన భూమిని జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. విశాఖ జిల్లా కేంద్రం నుంచి 26 కిలోమీటర్ల దూరంలోని ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం 250 ఎకరాలను అధికారులు గుర్తించారు.
ఏపీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని గతేడాది డిసెంబరులోనే గూగుల్ ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ గ్లోబల్ నెట్వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ బికాశ్ కోలే విశాఖలో అనువైన భూముల కోసం పలు ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సంస్థకు సుమారుగా 80 ఎకరాలు అవసరం అవుతుందని జిల్లా అధికారులకు తెలిపారు. భీమిలి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలు, పెద్ద సంఖ్యలో భూములు ఉండడంతో జిల్లా అధికారులు వాటినే గూగుల్ ప్రతినిధులకు చూపించారు.
తర్లువాడలోని భూములను గూగుల్కు ఇవ్వాలని నిర్ణయించినట్టు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇటీవల మీడియాతో అన్నారు. తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తే... విశాఖలో పెద్ద డేటా సెంటర్గా మారుతుంది.
సంబంధిత కథనం