ఏపీలో కొత్తగా 90వేల వితంతు పెన్షన్లను మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల తనిఖీ చేపట్టిన ప్రభుత్వం అర్హులైన వారికి పెన్షన్లను మంజూరు చేయడానికి అమోదం తెలిపింది. మరణించిన వారి స్థానంలో వారిపై ఆధారపడిన భార్య లేదా భర్తకు పెన్షన్లు మంజూరు చేస్తారు.
ఆంధ్రప్రదేశ్లో స్పౌజ్ కేటగిరీలో కొత్తగా 89,788 మందికి పింఛన్లు అందించ నున్నారు. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ పొందుతున్న లబ్దిదారులు ఎవరైనా మరణిస్తే అదే కుటుంబంలో పెన్షన్పై ఆధారపడిన వారికి వాటిని బదిలీ చేయనున్నారు.
భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా ఈ కేటగిరీని ప్రవేశపెట్టి గతేడాది నవంబరు నుంచే అమలు చేస్తోంది. అర్హులైన వారిని గుర్తించిన ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రతి నెల రూ.4 వేల చొప్పున చెల్లిస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు 2023 డిసెంబరు 1 నుంచి 2024 అక్టోబరు 31 మధ్య ఉన్న ఇదే కేటగిరీలో పెన్షన్లు కోల్పోయిన అర్హులైన వారికి కూడా మే 1 నుంచి పింఛన్ అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గురువారం ఆదేశాలు ఇచ్చింది.
పెన్షన్ పొందడానికి అర్హురాలైన మహిళ.. భర్త మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు తన ఆధార్ కార్డు తదితర వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాలి. ఏప్రిల్ 25 శుక్రవారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ వివరాలు స్వీకరిం చనున్నారు. అర్హులు ఈ నెల 30లోపు ఈ వివరాలు సమర్పిస్తే, మే 1న పింఛను సొమ్ము అందుతుంది.
మే 30లోపు నమోదు చేసుకోలేని వారికి జూన్ 1 నుంచి చెల్లి స్తారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ.35.91 కోట్ల అదనపు భారం పడనుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఏపీ కార్పొరేషన్ ఆఫ్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్- అప్కోస్ జాబితాల నుంచి తొలగించక పోవడంతో వారికి సంక్షేమ పథకాలు కూడా అందడం లేదు. మరోవైపు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు కూడా పెన్షన్లకు దూరం అయ్యాయి. రూ.30వేల లోపు జీతం ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి పెన్షన్లు పునరుద్దరిస్తామనే హామీ నెరవేరలేదు.
అప్కోస్ ద్వారా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొంత మేలు జరిగినా ఆ తర్వాత వారిని ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించి 2022లో వారికి సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటించారు. దీంతో దాదాపు లక్షన్నర మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెందిన కుటుంబాలకు సామాజిక పెన్షన్లను తొలగించారు.
ఒకే రేషన్ కార్డులో పేర్లు ఉన్నాయనే సాకుతో అప్పట్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలను దూరం చేశారు. రూ.25-30వేల లోపు జీతాలు ఉన్న వారిని ఈ నిబంధనల నుంచి మినహాయించాలని వేడుకున్నా అప్పట్లో ప్రభుత్వం కరుణించలేదు.
2024 జూన్లో వైసీపీ ఓటమి పాలై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయంలో నియమించిన వారిని పెద్ద సంఖ్యలో ఉద్యోగాల నుంచి తొలగించారు. వైసీపీ సానుభూతిపరులనే ముద్ర వేసి పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని ఇళ్లకు పంపారు. ఉద్యోగ నియామకాలు చేసే సమయంలోనే కో టెర్మినస్ వర్తించే నిబంధనలు ఉండటంతో ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం అప్కోస్ తొలగించి మళ్లీ ఏజెన్సీలను తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తొలగించిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 30వేల జీతంలోపు ఉన్న వారికి పథకాలను వర్తింప చేస్తామని హామీ ఇచ్చినా అది అమలు కాలేదు.మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగల నుంచి తొలగించిన వారిని ఇంకా అప్కోస్ జాబితాల్లోనే కొనసాగిస్తున్నారు.
ఉద్యోగాలు కోల్పోయి జీతాలు అందకపోయినా అప్కోస్ జాబితాల్లోనే ఉండటంతో వారికి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఒకే రేషన్ కార్డులో ఉన్నారనే కారణంతో వారి కుటుంబాల్లో అర్హులైన వారిని సామాజిక పెన్షన్లకు అనర్హులుగా పరిగణిస్తున్నారు. అప్కోస్ జాబితాల నుంచి తొలగించి తమకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలని ఉద్యోగాలు కోల్పోయిన వారు డిమాండ్ చేస్తున్నారు. అప్కోస్ జాబితాల్లో ఉండటం వల్ల సామాజిక పెన్షన్లకు దూరమైన వారు దాదాపు లక్షన్నర మందికి పైగా ఉంటారు.
సంబంధిత కథనం