AP Tourism: శ్రీ వారి భక్తులకు శుభవార్త, పర్యాటక శాఖ భాగస్వామ్యంతో తిరుమల శ్రీవారి దర్శనం, అమోదం తెలిపిన సీఎం
AP Tourism: తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీ పర్యాటక శాఖ తీపి కబురు చెప్పింది. పర్యాటక శాక ద్వారా తిరుమల శ్రీవారి దర్శనాలను పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అమోదం తెలిపారు. త్వరలోనే ఏపీ టూరిజం భాగస్వామ్యంతో తిరుమల దర్శనాలు ప్రారంభిస్తారు.

AP Tourism: పర్యాటక శాఖ ద్వారా తిరుమల శ్రీ వారి దర్శనాలకు అనుమతించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. టూరిజం చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ వినతికి స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పర్యాటక శాఖ ద్వారా దర్శనాలను పునరుద్ధరించాలని ఆదేశించారు.
తిరుమలలో పర్యాటక సంస్థలకు కేటాయిస్తున్న అన్ని రకాల దర్శనాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిపివేశారు. దీంతో భక్తులు ఎక్కడెక్కడి నుంచో తిరుమల చేరుకోడానికి ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శన సౌకర్యాలను పునరుద్ధరించాలని పర్యాటక శాఖ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ముఖ్యమంత్రిని కోరారు.
గురువారం సచివాలయంలో జరిగిన పర్యాటక శాఖ సమీక్షా సమావేశంలో టీటీడీ దర్శనాలకు అనుమతించడంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శన సౌకర్యాల విషయమై ముఖ్యమైన చర్చ జరిగింది.
గతంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శన ప్యాకేజీలను అందించే వారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవకతవకల కారణంగా ఈ సదుపాయాన్ని రద్దు చేయవలసి వచ్చింది. దీని వలన పర్యాటక శాఖకు గణనీయంగా ఆదాయాన్ని కోల్సోవాల్సి వచ్చింది.
పరిస్థితిని సమీక్షించిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో సీఎం సానుకూలంగా స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో సమన్వయం చేసుకొని దర్శన ప్యాకేజీలను పునరుద్ధరించాలని నిర్ణయించారు.
ఈ నిర్ణయంతో భక్తులకు మరింత సులభంగా శ్రీవారి దర్శనం లభించడమే కాకుండా, పర్యాటక శాఖకు కూడా అదనపు ఆదాయం లభించనుంది. దీనివల్ల రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
అందుబాటులోకి పలు ప్యాకేజీలు..
తాజా నిర్ణయంతో పలు సేవలు పర్యాటకులకు, తిరుమల శ్రీవారి భక్తులకు అందుబాటులోకి వస్తాయి.
- ప్రత్యేక దర్శన ప్యాకేజీల ప్రణాళిక రూపకల్పన
- భక్తుల సౌకర్యార్థం అదనపు సేవల కల్పన
- పారదర్శక నిర్వహణ విధానాల అమలు
- ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ ఏర్పాటు
- భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రవాణా సదుపాయాల కల్పన
వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.
"భక్తుల సౌకర్యం, పర్యాటక శాఖ అభివృద్ధి రెండింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఛైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తెలిపారు.