Gold Shop Robbery : పనిచేసిన దుకాణానికి కన్నమేసి…..
నగల దుకాణంలో వారం రోజులు మరమ్మతులు నిర్వహించిన ఎలక్ట్రిషియన్ షో కేసుల్లో పెట్టి ఉన్న ఆభరణాలు కాజేయడానికి ప్లాన్ చేశాడు. అర్థరాత్రి షట్టర్లు పగులగొట్టి లక్షల రుపాయల విలువైన ఆభరణాలు కాజేశాడు. ఎక్కడా వేలిముద్రలు లేకుండా జాగ్రత్త పడినా చివరకు పోలీసులు నిందితుడ్ని పట్టేశారు.
బంగారు ఆభరణాల దుకాణంలో ఎలక్ట్రికల్ రిపేర్స్ నిర్వహించిన యువకుడు షాపులో చోరీకి ప్లాన్ చేశాడు. అదను చూసి షట్టర్ తాళాలు పగులగొట్టి లక్షల రుపాయల విలువైనఆభరణాలు కాజేశాడు. చిన్న ఆధారం కూడా వదలకుండా చోరీ చేసినా చివరకు పోలీసులకు దొరికిపోయాడు.
ట్రెండింగ్ వార్తలు
కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో బందర్ రోడ్లో ఉన్న బంగారు ఆభరణాల దుకాణంలో చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుండి 41లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ బందర్ రోడ్ లో ఉన్న ఆభరణాల దుకాణంలో గత కొద్దిరోజులుగా ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఆగష్టు 17 రాత్రి షాప్ ను మూసి మరుసటి రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో షాప్ తెరిచేసరికి బంగారు వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెనుక వైపు ఉన్న తలుపు తాళం పగలగొట్టి దొంగతనం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంఘటనా స్థలంలో వేలిముద్రలు లభించకపోవడంతో పోలీసులకు కేసు సవాలుగా మారింది. దీంతో అక్కడ పనిచేస్తున్న వారి వివరాలను సేకరించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆదారంగా నిందితుడి వివరాలను సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి చోరీ చేసిన రూ.39,84,017/- విలువైన వజ్రాభరణాలు మరియు రూ.1,25,000/- నగదు మొత్తం రూ..41,09,017/- లక్షల విలువైన చోరిసోత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కొత్త పేటకు చెందిన మేకల వీరబాబుగా గుర్తించారు.
నిందితుడు మేకల వీరబాబు ఎలక్ట్రిషియన్గా పనిచేస్తున్నాడు. బందర్ రోడ్ లోని బంగారపు షాప్ ఆధునీకరణ పనులలో బాగంగా వీరబాబుకి ఎలక్ట్రికల్ పనులను అప్పగించారు. పది రోజులుగా ప్రతి రోజు వెళ్లి షాప్ లో ఎలక్ట్రికల్ పనులను చేస్తున్న వీరబాబు షాప్లో బంగారు ఆభరణాలను చూసేసరికి చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆగష్టు 17 రాత్రి పని ముగించుకున్న తరువాత ఇంటికి వెళ్ళకుండా చుట్టుపక్కల తిరుగుతూ అర్ధరాత్రి సమయంలో ఎవరు లేరని నిర్ధారించుకున్న తరువాత షాప్ వెనుక వైపు వున్న షట్టర్ తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డాడు. లోపల వున్న వజ్రాభరణాలు మరియు కౌంటర్ లో వున్న నగదు రూ.1,80,000/- దొంగతనం చేసిన తర్వాత అలారం మోగడంతో మిగిలిన వస్తువులను వదిలి పారిపోయాడు. నిందితుడు షాపు పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. అతనే చోరీ చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని ఆభరణాలు రికవరీ చేశారు.
టాపిక్