ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల ఖాతాదారులకు కీలకమైన అప్డేట్ వచ్చింది. మే1వ తేదీ నుంచి ఏపీలో నాలుగు ప్రాంతీయ బ్యాంకులు కనుమరుగు అవుతాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏపీలో ఇకపై ఒకే గ్రామీణ బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేషన్కు అనుగుణంగా నాలుగు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని విలీనం చేసి ఒకే బ్యాంకుగా కొనసాగిస్తారు.
ఆంధ్రప్రదేశ్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాలుగు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని విలీనం చేసి ఒకే బ్యాంకుగా నిర్వహిస్తారు. తాజా నిర్ణయంతో ప్రస్తుతం ఏపీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్(ఏపీజీవీబీ, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు(సీజీజీబీ), సప్తగిరి గ్రామీణ బ్యాంకు(ఎస్జీబీ)లను విలీనం చేస్తారు. వీటి కార్యకలాపాలు బుధవారంతో ముగుస్తాయి.
ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్(ఏపీజీవీబీ, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు(సీజీజీబీ), సప్తగిరి గ్రామీణ బ్యాంకు(ఎస్జీబీ)లను కలిపి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా విలీనం చేస్తారు. యూనియన్ బ్యాంక్ఆఫ్ ఇండియా దీనిని స్పాన్సర్ చేస్తుంది.
గ్రామీణ బ్యాంకుల విలీనంతో వారి ఖాతా నంబర్లు, ఐఎఫ్ఎస్సి కోడ్లు, బ్రాంచి చిరునామాలలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండదు. ఇప్పటికే ఉన్న అన్ని డిపాజిట్ ఖాతాలు, రుణాలు, ఇతర బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి.
వినియోగదారులు చెక్బుక్లు, పాస్ బుక్లు, ఏటిఎం కార్డులను, డిజిటల్ సేవలను కొనసాగించవచ్చు. కొత్తగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ తరపున మే1 వ తేదీ నుంచి కార్యకలాపాలు నడుస్తాయి.
తెలంగాణలో గ్రామీణ బ్యాంకుల విలీనం ఇప్పటికే పూర్తైంది. వేర్వేరు పేర్లతో గ్రామీణ బ్యాంకులు సేవలందించే విధానానికి ఆర్థిక శాఖ ముగింపు పలికింది. ఇవన్నీ ఇకపై ఒకే బ్యాంకు పనిచేసే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. తెలంగాణలో ఉమ్మడి గ్రామీణ బ్యాంక్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఏపీలో మే 1నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభిస్తుంది.
సంబంధిత కథనం