Road Accident in Tirupati : చంద్రగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భక్తులు మృతి
tirupati district crime news: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్టును కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు.
Road Accident in Tirupati : ఓ కారు వేగంగా వెళ్లి కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. చంద్రగిరి మండలం కల్రోడ్డుపల్లి వద్ద ఉన్న కల్వర్టును... కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. మృతులంతా మహారాష్ట్రవాసులుగా తెలుస్తోంది. తిరుమల దర్శనం తర్వాత కాణిపాకం వెళ్లే క్రమంలో ఈ విషాద ఘటన జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ట్రెండింగ్ వార్తలు
2 లక్షల చోరీ...
తిరుమల లడ్డూ కౌంటర్లో రూ.2 లక్షల చోరీ జరిగింది. ఓ కార్పొరేషన్ ద్వారా తిరుమల లడ్డూ కాంప్లెక్సులో కొద్దిరోజుల కిందట కిషోర్ అనే వ్యక్తి కౌంటర్ బాయ్గా చేరాడు. అయితే సోమవారం రాత్రి 36వ కౌంటరులో విధులు నిర్వహించగా... లడ్డూల విక్రయం ద్వారా వసూలైన రూ.2 లక్షలను తనవద్దే ఉంచుకుని, గడియ పెట్టడం మరిచిపోయి కౌంటర్లోనే నిద్రపోయారు. ఉదయం నిద్రలేచి చూడగా నగదు సంచి కనిపించకపోవడంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి పాత నేరస్థుడైన సీతాపతిని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరుమల వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.45 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.