వైసీపీ మాజీ ఎంపీ సాయిరెడ్డి సిట్ విచారణకు హాజరు కాలేదు. శుక్రవారం విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా గురువారమే వస్తానని చెప్పిన సాయిరెడ్డి, చివరి నిమిషంలో విచారణకు రాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సాయిరెడ్డిని మరోసారి నోటీసులు ఇచ్చి విచారించాలని విజయవాడ పోలీసులు భావిస్తున్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన మద్యం కొనుగోళ్లు, అమ్మకాలపై సిట్ విచారణలో వేగం పెరిగింది. గురువారం సిట్ విచారణకు రావాలని మాజీ ఎంపీ సాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని ప్రచారం జరిగింది. అయితే విజయవాడలో జరగాల్సిన విచారణకు సాయిరెడ్డి హాజరు కాలేదు. దీంతో సాయిరెడ్డికి మరోసారి విచారణకు పిలుస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ కేసులో ఇప్పటికే ఓసారి సిట్ విచారణకు హాజరైన సాయిరెడ్డి… మద్యం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి పేరును ప్రస్తావించారు. సాయిరెడ్డి ప్రకటన తర్వాత అరెస్ట్ చేస్తారనే భయంతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ చేయకుండా రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఉపశమనం దక్కకపోవడంతో సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ పొందారు.
సాయిరెడ్డిని సాక్షిగా పరిగణిస్తూ సిట్ విచారణకు పిలిచిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చని ప్రచారం జరిగింది. అదే సమయంలో రాజ్యసభ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వ హయంలో సాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఓ దశలో వైసీపీలో నంబర్ 2గా చలామణీ అయ్యారు. ఆ తర్వాత రకరకాల పరిణామాల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడితో దూరం పెరుగుతూ వచ్చింది. గత ఏడాది కాకినాడ సీ పోర్ట్ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత సాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు.
బీఎన్ఎస్ సెక్షన్ 179 ప్రకారం మద్యం కొనుగోళ్లు, డిస్టలరీలకు ఆర్డర్లు, విక్రయాలపై సాక్ష్యం ఇచ్చేందుకు ఆయన్ని పిలిచారు. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసుకు సంబంధించిన వాస్తవాలు, వాటికి సంబంధించిన సమాచారం తెలిసినందున, కేసు దర్యాప్తులో భాగంగా వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సాయిరెడ్డి నివాసానికి వెళ్లి సిట్ బృందం ఈ నోటీసులు అందజేసింది.
మద్యం వ్యవహారంలో అంతిమంగా నిధులు ఎక్కడికి ప్రవహించాయనే దానిపై సిట్ ఆరా తీస్తోంది. వైసీపీ హయంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయాలు జరిగినా ఆర్డర్లు మాత్రం కొందరి కనుసన్నల్లో జరిగేవని ఒక్కో మద్యం కేసుకు రూ.150 నుంచి రూ.450 వరకూ లంచాలు తీసుకున్నారని, అలా చెల్లించిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారని, నెలకు రూ.60 కోట్ల చొప్పునరూ.3వేల కోట్లు వసూలు చేశారని కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది.
సాయిరెడ్డి ఇప్పటికే మద్యం కేసులో ఏమి జరిగిందో వాస్తవాలు బయట పెట్టేందుకు సిద్ధమైనట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో సిట్ విచారణకు హాజరైన సమయంలోనే సూత్రధారులు, పాత్ర ధారుల పేర్లను ఆయన ప్రస్తావించారు. ఓ వైపు రాజ్యసభ ఉపఎన్నికల షెడ్యూల్ వెలువడటం, మరోవైపు లిక్కర్ కేసులో సిట్ వేగం పెంచడంతో రెండింటికి సంబంధం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సంబంధిత కథనం