సిట్ విచారణకు మాజీ ఎంపీ సాయిరెడ్డి డుమ్మా, లిక్కర్‌ కేసులో విచారణకు రావాలని పిలిచిన పోలీసులు…-former ycp ex mp vijaya sai reddy absent from sit inquiry ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  సిట్ విచారణకు మాజీ ఎంపీ సాయిరెడ్డి డుమ్మా, లిక్కర్‌ కేసులో విచారణకు రావాలని పిలిచిన పోలీసులు…

సిట్ విచారణకు మాజీ ఎంపీ సాయిరెడ్డి డుమ్మా, లిక్కర్‌ కేసులో విచారణకు రావాలని పిలిచిన పోలీసులు…

Sarath Chandra.B HT Telugu

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి లిక్కర్‌ కేసులో విచారణకు డుమ్మా కొట్టారు. వైసీపీ ప్రభుత్వ హయంలో మద్యం కొనుగోళ్లు, అమ్మకాల్లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో సాయిరెడ్డిని కీలక సాక్షిగా భావిస్తున్నారు.

వైసీపీ మాజీ ఎంపీ సాయిరెడ్డి

వైసీపీ మాజీ ఎంపీ సాయిరెడ్డి సిట్ విచారణకు హాజరు కాలేదు. శుక్రవారం విచారణకు రావాలని సిట్‌ అధికారులు నోటీసులు ఇవ్వగా గురువారమే వస్తానని చెప్పిన సాయిరెడ్డి, చివరి నిమిషంలో విచారణకు రాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సాయిరెడ్డిని మరోసారి నోటీసులు ఇచ్చి విచారించాలని విజయవాడ పోలీసులు భావిస్తున్నారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన మద్యం కొనుగోళ్లు, అమ్మకాలపై సిట్‌ విచారణలో వేగం పెరిగింది. గురువారం సిట్‌ విచారణకు రావాలని మాజీ ఎంపీ సాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని ప్రచారం జరిగింది. అయితే విజయవాడలో జరగాల్సిన విచారణకు సాయిరెడ్డి హాజరు కాలేదు. దీంతో సాయిరెడ్డికి మరోసారి విచారణకు పిలుస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఈ కేసులో ఇప్పటికే ఓసారి సిట్ విచారణకు హాజరైన సాయిరెడ్డి… మద్యం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన రాజ్‌ కసిరెడ్డి పేరును ప్రస్తావించారు. సాయిరెడ్డి ప్రకటన తర్వాత అరెస్ట్‌ చేస్తారనే భయంతో వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి అరెస్ట్‌ చేయకుండా రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఉపశమనం దక్కకపోవడంతో సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ పొందారు.

మద్యం కేసులో సాక్షిగా సాయిరెడ్డి..?

సాయిరెడ్డిని సాక్షిగా పరిగణిస్తూ సిట్‌ విచారణకు పిలిచిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చని ప్రచారం జరిగింది. అదే సమయంలో రాజ్యసభ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

వైసీపీ ప్రభుత్వ హయంలో సాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఓ దశలో వైసీపీలో నంబర్‌ 2గా చలామణీ అయ్యారు. ఆ తర్వాత రకరకాల పరిణామాల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడితో దూరం పెరుగుతూ వచ్చింది. గత ఏడాది కాకినాడ సీ పోర్ట్ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత సాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జగన్మోహన్‌ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు.

బీఎన్‌ఎస్‌ సెక్షన్ 179 ప్రకారం మద్యం కొనుగోళ్లు, డిస్టలరీలకు ఆర్డర్లు, విక్రయాలపై సాక్ష్యం ఇచ్చేందుకు ఆయన్ని పిలిచారు. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసుకు సంబంధించిన వాస్తవాలు, వాటికి సంబంధించిన సమాచారం తెలిసినందున, కేసు దర్యాప్తులో భాగంగా వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సాయిరెడ్డి నివాసానికి వెళ్లి సిట్ బృందం ఈ నోటీసులు అందజేసింది.

అసలు టార్గెట్‌ కోసమే దర్యాప్తు..?

మద్యం వ్యవహారంలో అంతిమంగా నిధులు ఎక్కడికి ప్రవహించాయనే దానిపై సిట్ ఆరా తీస్తోంది. వైసీపీ హయంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయాలు జరిగినా ఆర్డర్లు మాత్రం కొందరి కనుసన్నల్లో జరిగేవని ఒక్కో మద్యం కేసుకు రూ.150 నుంచి రూ.450 వరకూ లంచాలు తీసుకున్నారని, అలా చెల్లించిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారని, నెలకు రూ.60 కోట్ల చొప్పునరూ.3వేల కోట్లు వసూలు చేశారని కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది.

సాయిరెడ్డి ఇప్పటికే మద్యం కేసులో ఏమి జరిగిందో వాస్తవాలు బయట పెట్టేందుకు సిద్ధమైనట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో సిట్‌ విచారణకు హాజరైన సమయంలోనే సూత్రధారులు, పాత్ర ధారుల పేర్లను ఆయన ప్రస్తావించారు. ఓ వైపు రాజ్యసభ ఉపఎన్నికల షెడ్యూల్ వెలువడటం, మరోవైపు లిక్కర్ కేసులో సిట్ వేగం పెంచడంతో రెండింటికి సంబంధం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం