పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో ఎలాంటి హత్యా కోణం లేదని పోలీసులు తేల్చారు. పోలీసుల దర్యాప్తులో ప్రవీణ్ కుమార్ మద్యం మత్తులో ఉండటం వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించారని తేలింది. అయితే.. ఈ కేసులో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది హత్య అని ఆరోపిస్తున్నారు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కోర్టులో పిల్ దాఖలు చేశారు.
'పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో రీ-పోస్టుమార్టం కోరుతూ హైకోర్టులో పిల్ వేశా. ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో నిపుణులు లేదా నిమ్స్, గాంధీ ఆసుపత్రిలో వైద్యులతో రీ-పోస్టుమార్టం చేయాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఇప్పటికీ పోస్టుమార్టం నివేదిక బయట పెట్టలేదు. ప్రవీణ్ది హత్య అని అనుమానం కలుగుతోంది' అని మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యానించారు.
'ఘటనా స్థలం నుంచి భౌతిక కాయాన్ని అడ్డదారిలో రాజమండ్రి తరలించారు. ఇటీవల ఘటనా స్థలానికి వెళ్లి చూస్తే ఒక గోనె సంచి, మద్యం సీసాలు, పక్కనే మంట వేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ కేసు విచారణ విషయంలో సహకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాస్తా. ప్రవీణ్ మృతిచెందిన ప్రాంతానికి దగ్గర్లో వచ్చే నెల 24న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం' అని హర్షకుమార్ స్పష్టం చేశారు.
ప్రవీణ్ కుమార్ తన ప్రయాణంలో హైదరాబాద్, కోదాడ, ఏలూరు వద్ద మద్యం కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన యూపీఐ చెల్లింపుల వివరాలు కూడా లభ్యమయ్యాయి.
చిల్లకల్లు, కీసర, రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద ఆయన వాహనం నుండి పడిపోయారు.
పోస్ట్ మార్టం నివేదికలో తలకు బలమైన గాయం, ఇతర శరీర భాగాలకు గాయాలు ఉన్నట్లు తేలింది. ఫోరెన్సిక్ నివేదికలో ఆయన కడుపు, చిన్న ప్రేగు, కాలేయం, కిడ్నీ, ప్లీన్లో ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్లు నిర్ధారించారు.
ప్రమాదం జరిగిన సమయంలో ప్రవీణ్ కుమార్ 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు.
ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇతర వాహనాలు ఢీకొన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు.
ప్రవీణ్ కుమార్ భార్య కూడా పోలీసుల దర్యాప్తుపై నమ్మకం ఉంచారని పోలీసులు వివరించారు.
సంబంధిత కథనం