మాజీమంత్రి విడదల రజనీకి ఉన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. రజనీపై నమోదు చేసిన కేసుకు సంబంధించి.. 41-ఏ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. విచారణకు సహకరించాలని కూడా రజనీకి కోర్టు సూచించింది. రజనీ పీఏ రామకృష్ణకు 41-ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. లక్ష్మీ బాలాజీ స్టోన్స్ క్రషర్స్ యజమానులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని రజనీపై అభియోగాలు ఉన్నాయి.
విడదల రజనీపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం నుండి ఆమె, ఇతరులు రూ. 2.2 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రజనీని ఏ1గా, అప్పటి ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పల్లె జాషువాను ఏ2గా, రజనీ మరిది విడదల గోపిని ఏ3గా, ఆమె వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణను ఏ4గా పేర్కొన్నారు.
శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ మేనేజింగ్ పార్ట్నర్ నల్లపనేని చలపతి రావు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
రజనీ తన పదవిని ఉపయోగించి అక్రమంగా డబ్బు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జాషువా, గోపి ఒక్కొక్కరు రూ.10 లక్షలు అదనంగా వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
తమ కంపెనీ కార్యకలాపాలు కొనసాగించడానికి మొదట రూ.5 కోట్లు డిమాండ్ చేశారని చలపతి రావు ఆరోపించారు.
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
ప్రభుత్వం ఫిర్యాదును పరిశీలించి ఏసీబీ విచారణకు ఆదేశించింది.
ఈ కేసులో విడదల రజనీ మరిది విడదల గోపిని ఏసీబీ అధికారులు హైదరాబాద్లో అరెస్టు చేశారు.
గోపిని విజయవాడకు తరలించి కోర్టులో హాజరుపరిచారు.
తనపై వచ్చిన ఆరోపణలను విడదల రజనీ ఖండించారు. ఇది టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం "రాజకీయ కక్ష సాధింపు" అని ఆమె వ్యాఖ్యానించారు.
టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు వ్యక్తిగత కక్షతో ఈ కేసును ఫ్యాబ్రికేట్ చేశారని రజనీ ఆరోపించారు.
సంబంధిత కథనం