ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు అరెస్ట్‌,సినీ నటి వ్యవహారంలో ఇప్పటికే సస్పెన్షన్-former ap intelligence dg psr anjaneyulu arrested already suspended in actress case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు అరెస్ట్‌,సినీ నటి వ్యవహారంలో ఇప్పటికే సస్పెన్షన్

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు అరెస్ట్‌,సినీ నటి వ్యవహారంలో ఇప్పటికే సస్పెన్షన్

Sarath Chandra.B HT Telugu

ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ మాజీ డీజీ పిఎస్సార్ ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినీ నటి కాదంబడి జెత్వానీ అరెస్ట్ వ్యవహారంలో పిఎస్సార్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో పిఎస్సార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇంటెలిజెన్స్ మాజీ డీజీ సీతారామాంజనేయులు అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన సీనియర్ IPS అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. ముంబైకు చెందిన సినీ నటి కాదంబరి జెత్వానీ కేసులో పిఎస్సార్‌ ఆంజనేయులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో పిఎస్సార్ ఏ2గా ఉన్నారు.

ముంబై నటి కాదంబరి జెత్వాని ఆరోపణలపై పిఎస్సార్‌ ఆంజనేయులుతో పాటు విజయవాడ సీపీ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణలపై సీఐడీ కేసులు నమోదు చేసింది. పిఎస్సార్ మినహా మిగిలిన పోలీస్ అధికారులు ముందస్తు బెయిల్‌ పొందారు. ఈ కేసులో తన ప్రమేయం లేదన్న పిఎస్సార్‌ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోలేదు.

ముంబై నటి వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఇంటెలిజెన్స్‌ డీజీని మంగళవారం తెల్లవారుజామున సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ముంబైకు చెందిన పారిశ్రామికవేత్తపై నమోదైన కేసు వ్యవహారంలో పక్కా వ్యూహంతో నటిపై కేసులు నమోదు చేసి ఆమె పెట్టిన ఫిర్యాదులను ఉపసంహరించుకునేలా చేశారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.

వైసీపీ ప్రభుత్వ హయంలో పిఎస్సార్‌ ఆంజనేయులు కీలకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ చేయడంతో పాటు ప్రతిపక్షాలను వేధించారని, కేసుల దర్యాప్తులో ప్రతిపక్షాలను టార్గెట్ చేసేలా నేరుగా ఆదేశాలు జారీ చేశారని టీడీపీ గతంలో పలుమార్లు ఆరోపించింది.

ముంబై నటి వ్యవహారంలో కుక్కల విద్యా సాగర్‌ ఫిర్యాదుతో జరిగిన పరిణామాల వెనుక పిఎస్సార్‌ ఉన్నాడని సీఐడీ భావిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు కొద్ది నెలలుగా సస్పెన్షన్‌లో ఉన్నారు. విజయవాడ విడిచి వెళ్లకూడదని ఉత్తర్వులు ఉన్నా ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తున్నారు.

ఆంజనేయులును అరెస్ట్‌ చేసేందుకు బేగంపేటలోని ఆయన నివాసంతో పాటు మొయినాబాద్‌కు ఏపీ సీఐడీ బృందాలు వెళ్లాయి. మొయినాబాద్ లో ఉన్న పిఎస్సార్ ఆంజనేయులు ఫార్మ్ హౌస్ కి వచ్చిన ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు సమాచారం అందించారు. ఉదయం 7 గంటలకు అదుపులోకి తీసుకుని విజయవాడ తరలిస్తున్నారు. పిఎస్సార్‌ ఆంజనేయులుపై రఘు రామకృష్ణం రాజు కస్డోడియల్ టార్చర్‌ కేసులో హత్యాయత్నం అభియోాలు కూడా గతంలో నమోదు చేశారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం