కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ- కారు ఢీకొన్న ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సీ.కే దిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఐదుగురు స్పాట్లోనే చనిపోయారు. రాయచోటి నుంచి కారులో కడపకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతులు బద్వేలు మండలం చింతపుత్తయ పల్లెకు చెందిన వారుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన వారుగా నిర్ధారణ అయ్యింది. జాతర నేపథ్యంలో వీరంతా రాయచోటి నుంచి కడపకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ రోడ్డుప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.
గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో లారీ-కారు ఢీ కొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే కుటంబం వారంతా ఇలా మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
సంబంధిత కథనం