Fire Accident: గన్నవరం లిటిల్ లైట్స్ అనాథశ్రమంలో అగ్నిప్రమాదం, ఆరుగురు చిన్నారుల గాయాలు..
Fire Accident: కృష్ణా జిల్లాలో గన్నవరం మండలం గోపనపల్లి గ్రామంలో ఉన్న లిటిల్ లైట్స్ అనాథశ్రమంలో అర్థరాత్రి మంటలు చెలరేగాయి. చిన్నారులు నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Fire Accident: కృష్ణా జిల్లా గన్నవరంలో ఘోర ప్రమాదం తప్పింది. గోపనపల్లి గ్రామంలో ఉన్న లిటిల్ లైట్స్ అనాధాశ్రమంలో అర్థరాత్రి దాటిన తర్వాత మంటలు చెలరేగాయి. ఈ అనాథశ్రమంలో దాదాపు 140మంది బాలబాలికలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమం ప్రాంగణంలోనే వారికి పాఠశాలను నిర్వహిస్తున్నారు.
సోమవారం అర్థరాత్రి భవనం రెండో అంతస్తులో ఉన్న బాలల విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చిన్నారులు ప్రాణభయంతో కిందకు పరుగులు తీశారు. ఆరుగురు విద్యార్ధులు మాత్రం మంటల్లో చిక్కుకుపోయారు. అగ్నిప్రమాదం సమాచారం అందడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. మంటల్లో చిక్కుకున్న బాలల్ని ఫైర్ సిబ్బంది కాపాడారు.
అగ్ని కీలలు వ్యాపించిన సమయంలో గదిలో చిక్కుకుపోయిన చిన్నారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణనష్టం తప్పింది. నిరాశ్రయులు, తల్లిదండ్రులు లేని వారు, దుర్భర పేదరికంలో ఉన్న పిల్లల్ని చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నారు. హాస్టల్లో అగ్ని ప్రమాదం జరగడం, పిల్లల మంచాలపై ఉన్న బెడ్డింగులు కాలిపోవడంతో విద్యార్ధులు మధ్య ఘర్షణ జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంటలు చెలరేగడానికి అవకాశం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.