Amar Raja FireAccident : అమర్‌ రాజాలో భారీ అగ్నిప్రమాదం….-fire accident in amara raja batteries tbd division in chittore district and crores of rupees loss ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Fire Accident In Amara Raja Batteries Tbd Division In Chittore District And Crores Of Rupees Loss

Amar Raja FireAccident : అమర్‌ రాజాలో భారీ అగ్నిప్రమాదం….

HT Telugu Desk HT Telugu
Jan 31, 2023 08:25 AM IST

Amar Raja FireAccident అమర్‌ రాజా బ్యాటరీస్‌ కర్మాగారంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కోట్లాది రుపాయల ఆస్తి నష్టం జరిగింది. చిత్తూరు సమీపంలోని అమర్ రాజాగ్రోత్ కారిడార్‌లో సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ట్యూబులర్ బ్యాటరీ విభాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసి పడ్డాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

ప్రమాదంలో కాలిపోతున్న అమర్ రాజా బ్యాటరీ టిబిడి విభాగం
ప్రమాదంలో కాలిపోతున్న అమర్ రాజా బ్యాటరీ టిబిడి విభాగం

Amar Raja FireAccident చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి భోజన విరామ సమయంలో షార్ట్‌ సర్క్యూట్ కారణంగా ట్యూబులర్ బ్యాటరీ డివిజన్‌లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఉద్యోగులకు భోజన విరామం కావడంతో కార్మికులు లేకపోవడంతో ముప్పు తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే చిత్తూరు, పలమనేరు నియోజక వర్గాల నుంచి అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. అర్థరాత్రి వరకు మంటలు చెలరేగుతూనే ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

చిత్తూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జిల్లాలోని యాదమరి మండలం, మోర్ధానపల్లె సమీపంలోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ నుండి భారీగా అగ్నికీలలు ఎగసిపడటంతో కార్మికులు ఆందోళన చెందారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉండవచ్చని కంపెనీ చెబుతోంది.

అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న యాదమరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ట్యూబులర్ డివిజన్‌ తయారైన బ్యాటరీలను ట్రయల్ కోసం రీఛార్జి చేసే సెక్షన్‌లో ప్రమాదం జరిగింది. రీ ఛార్జి చేసే విభాగంలో బ్యాటరీలకు కనెక్ట్‌ చేసే వైర్లు పాడవడంతో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు చెబుతున్నారు. ఈ విభాగంలో లెడ్ యాసిడ్‌తో పాటు మరికొన్ని కెమికల్స్‌ కూడా ఉండటంతో వేగంగా మంటలు వ్యాపించాయి.

ప్రమాదం జరిగిన విభాగంలో 600మంది ఉద్యోగులు పనిచేస్తుండగా రాత్రి షిఫ్ట్‌లో 180మంది విధుల్లో ఉన్నారు. భోజన విరామ సమయంలో 160మంది భోజనానికి వెళ్లగా 20మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మంటలు చెలరేగిన వెంటనే ఉద్యోగులు అంతా సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోయారు. ప్రమాద సమయంలో భారీ పేలుడు జరిగినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తీ నష్టం వాటిల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల దాదాపు కిలోమీటర్ మేర పొగలు వ్యాపించాయి.

గతంలోనూ భారీ అగ్నిప్రమాదం, రూ.20 కోట్ల నష్టం

చిత్తూరు జిల్లాలోని అమర్ రాజా గ్రూప్ నకు చెందిన మంగళ్ ఇండస్ట్రీలో గతంలో కూడా భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆరేళ్ల కిందట పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో అమర రాజా గ్రూపునకు చెందిన ఇండస్ట్రీలో జరిగిన అగ్ని ప్రమాదంతో రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం, ఎవరికి గాయాలు లాంటివి కాలేదు.

2017లో జనవరి నెలలో యూనిట్ లోని జింగ్ కోటింగ్ సెగ్మెంట్ వద్ద కంట్రోల్ ప్యానెల్ నుంచి నిప్పు రవ్వ వచ్చింది. షిఫ్ట్ సిబ్బంది తమ పనిలో నిమగ్నమై ఉండగా కొన్ని నిమిషాల్లోనే ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఆ ఫ్యాక్టరీ యూనిట్లోని దాదాపు 300 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. చిత్తూరు నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో చిత్తూరు-బెంగుళూరు జాతీయ రహదారి పక్కన 500ఎకరాల విస్తీర్ణంలో అమరరాజా గ్రోత్ కారిడార్ పేరిట సెజ్ ఉంది. ప్రమాదం జరిగిన విభాగానికి ఇన్స్యూరెన్స్ ఉందని కంపెనీ ప్రకటించింది.

IPL_Entry_Point

టాపిక్