చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలకు అండగా నిలవడానికి.. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద.. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు.
పథకం పేరు- మత్స్యకార సేవలో
ప్రారంభించే వారు- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ప్రారంభ తేదీ- ఏప్రిల్ 26, 2025
ప్రారంభించే స్థలం- బుడగట్లపాలెం గ్రామం, ఎచ్చెర్ల నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా
లబ్ధిదారులు- సముద్ర తీర ప్రాంతంలో చేపల వేటపై ఆధారపడిన మత్స్యకార కుటుంబాలు
చేపల వేట నిషేధ కాలంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ. 20,000 ఆర్థిక సహాయం అందిస్తారు.
ఈ సహాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,29,178 మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.
ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.258 కోట్లు కేటాయించింది.
ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు (61 రోజుల పాటు) సముద్రంలో చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకారులు ఉపాధి కోల్పోతారు. ఈ ఆర్థిక సహాయం ద్వారా వేటలేని కాలంలో మత్స్యకారులకు జీవనోపాధిని కొనసాగించడానికి తోడ్పాటు అందిస్తారు. గత ప్రభుత్వం అందించిన రూ. 10,000 సహాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం రూ.20,000కు పెంచింది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయంలో ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుందని ఆశిస్తున్నారు.
ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు చేపల వేటపై నిషేధం విధించడానికి ప్రధాన కారణం చేపల సంతానోత్పత్తి కాలం. ఈ సమయంలో చాలా రకాల చేపలు గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి. కాబట్టి, ఈ సమయంలో చేపల వేటను నిషేధిస్తే, చేపల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది. దీని వలన భవిష్యత్తులో చేపల లభ్యత మెరుగుపడుతుంది. మత్స్యకారుల జీవనోపాధి కూడా మెరుగుపడుతుంది.
ఈ నిషేధం కేవలం సముద్రంలోనే కాకుండా నదులు, చెరువులు, ఇతర నీటి వనరులకు కూడా వర్తిస్తుంది. ఈ సమయంలో చేపల వేట కొనసాగిస్తే, చేపల సంతతి తగ్గిపోయి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఈ నిషేధాన్ని అమలు చేయడం ద్వారా.. ప్రభుత్వం చేపల సంరక్షణకు, మత్స్యకారుల భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది.
సంబంధిత కథనం