విశాఖపట్నం జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని నాలుగేళ్ల కుమార్తెపై కన్నతండ్రే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతన్నారు.
ఈ ఘటన విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి భార్య, నాలుగేళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. ఆ వ్యక్తి భార్య, పిల్లలతో విశాఖపట్నం వన్టౌన్లోని జాలారిపేటలో నివాసం ఉంటున్నాడు.
దాదాపు రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య వివిధ కారణాలతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య జాలారిపేటలోనే ఉన్న పుట్టింట్లో పిల్లలతో ఉండగా…. పక్క ఇంట్లోనే భర్త వేరేగా ఉంటున్నాడు. అయితే మంగళవారం రాత్రి మళ్లీ భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భర్త ఇద్దరు పిల్లలను తీసుకుని తగరపువలసకు వెళ్లాడు.
అక్కడ పాత సినిమా హాలు జంక్షన్ వద్దకు వెళ్లిన తరువాత ఒక దుకాణం ముందు వేసిన రేకుల షెడ్లో పిల్లలను నిద్రపుచ్చాడు. కుమారుడు, కుమార్తె నిద్రపోతుండగా మద్యం మత్తులో ఉన్న తండ్రి విచక్షణ మరిచి తన నాలుగేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాటిక బిగ్గరగా ఏడుస్తూ కేకలు వేసింది.
అప్పటికే అక్కడికి బళ్లారి నుంచి పప్పులోడుతో వచ్చి ఆగింది. తగరపువలస మార్కెట్కు మంగళవారం సెలవు కావడంతో అన్లోడ్ చేయకుండా లారీ అక్కడే ఉండిపోయింది. లారీ డ్రైవర్, క్లీనర్లు లారీలోనే వంట చేసుకుంటున్నారు. చిన్నారి శబ్దాలను గమనించిన వారు… అక్కడికి వెళ్లి చూశారు. బాలికపై ఆ వ్యక్తి లైంగిక దాడి చేస్తున్నాడు. దీన్ని డ్రైవర్కు చెప్పడంతో ఆయన కూడా దిగి వచ్చాడు.
ఇద్దరూ కలిసి ఈ విషయం జాతీయ రహదారిపై వెళ్లే ద్విచక్ర వాహనాలను ఆపి, వాహనదారులకు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వీరు కన్నడంలో మాట్లాడటంతో వారికి అర్థం కాలేదు. సమీపంలోని బ్యాంక్ సెక్కూరిటీ గార్డు వద్దకు వెళ్లి విషయం చెప్పగా…. తనకు తెలిసిన హోంగార్డుకు సమాచారం ఇచ్చాడు. అతడు తగరపువలసలో ఉన్న కానిస్టేబుల్కు చెప్పడంతో అతడు వెళ్లి చూసేసరికి బాలిక తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతోంది. దీంతో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న మహిళా పోలీస్స్టేషన్ సీఐ నిర్మలకు సమాచారం అందించాడు.
ఆమె వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అలాగే బాలికకు కేజీహెచ్లో వైద్య పరీక్షలు చేశారు. అక్కడే నిద్రపోతున్న బాలిక అన్నయ్యను తల్లి వద్దకు పంపించారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని భీమిలి పోలీస్స్టేషన్కు తరలించారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ సీహెచ్ పెంటారావు బుధవారం పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి…. మహిళా పోలీస్స్టేషన్కు అప్పగించామని సీఐ తిరుమలరావు తెలిపారు.