బాలయ్య బాబుకు మంత్రి పదవి ఇవ్వాలి.. హిందూపురంలో ఫ్యాన్స్ డిమాండ్-fans demand for minister post to hindupuram mla nandamuri balakrishna ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  బాలయ్య బాబుకు మంత్రి పదవి ఇవ్వాలి.. హిందూపురంలో ఫ్యాన్స్ డిమాండ్

బాలయ్య బాబుకు మంత్రి పదవి ఇవ్వాలి.. హిందూపురంలో ఫ్యాన్స్ డిమాండ్

Anand Sai HT Telugu

నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. అభిమానులు కాన్వాయ్ అడ్డుకుని నినాదాలు చేశారు.

బాలకృష్ణ

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అభిమానులు కాన్వాయ్ అడ్డుకుని.. బాలయ్య బాబుకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓపిక పట్టాలని, అవసరం అయినప్పుడు పదవి వస్తుందని బాలయ్య చెప్పారు.

పర్యటనలో భాగంగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డి బసవనపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో అదనపు గదులు, బీటీ రోడ్డును ఎమ్మెల్యే బాలయ్య ప్రారంభించారు. బీటీ రోడ్డు ప్రారంభోత్సవం తర్వాత టీడీపీ కార్యకర్తలు, ఫ్యాన్స్ బాలకృష్ణ మంత్రి పదవి తీసుకోవాలని బాలయ్య కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు.

హిందూపురం నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, అన్ని కష్టాల్లోనూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచినప్పటికీ బాలయ్య బాబుకు మంత్రి పదవి రావడం లేదని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ హిందూపూర్ పర్యటన సందర్భంగా ఆయన అభిమానులు, మద్దతుదారులు తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ఊపుతూ, నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.

ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బాలకృష్ణ ఫేమ్ పని చేస్తుందని ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వారసత్వాన్ని పక్కనపెడుతున్నారని కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

హిందూపురంలో పర్యటనలో పరిశ్రమలు, పాఠశాలలు స్థాపించిన దివంగత నేత, మాజీ సీఎం ఎన్టీ రామారావును బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తనకు చదువు పట్ల అంత శ్రద్ధ ఉండేది కాదని, ఎలాగోలా డిగ్రీ పూర్తి చేశానని బాలకృష్ణ చెప్పారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.