Family Doctor Concept : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్
Andhra Pradesh Family Doctor Concept : ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అమలు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రారంభమైంది. గ్రామాల్లో నివసించే ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యం.
చిత్తూరు జిల్లా(Chittoor District)లో మొత్తం 31 మండలాల్లో 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు) పరిధిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్(Family Doctor Concept) అమలులోకి వచ్చింది. తిరుపతి(Tirupati) జిల్లాలో 33 గ్రామాల్లో దీన్ని ప్రారంభించారు. అమలులో ఉన్న పథకంపై అధికారులు అధ్యయనం చేసి లోపాలను సరిచేస్తారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ జనవరి 2023లో పూర్తిస్థాయిలో ప్రారంభమవుతుంది.
ట్రెండింగ్ వార్తలు
'వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్(YSR Village Health Clinic) ప్రారంభంతో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గ్రామీణ ఆరోగ్య సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న సబ్ సెంటర్లు, అదనంగా మరో 250 సబ్ సెంటర్లను హెల్త్ క్లీనిక్ లుగా మార్చనున్నారు. ఒక్కో క్లినిక్ గ్రామంలో దాదాపు 2,000 మందికి సేవలు అందిస్తుంది.' అని సీనియర్ డాక్టర్ ఒకరు చెప్పారు.
ప్రతి క్లినిక్కి ఒక డాక్టర్ నేతృత్వం వహిస్తారు. నర్సింగ్ గ్రాడ్యుయేట్ మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్గా నియమిస్తారు. వీరికి ANM, ASHA వర్కర్ల బృందం సహాయం చేస్తుంది. విలేజ్ హెల్త్ క్లినిక్ పరిధిలో నివసిస్తున్న ప్రజలకు 14 రకాల పరీక్షలు, 67 రకాల మందులను అందిస్తారు. ప్రతి క్లినిక్ లో వ్యాధి నియంత్రణ కార్యక్రమాలు, ప్రసవానంతర, ఇతర చికిత్సలను కూడా చేస్తారు.
ప్రతి మండలానికి రెండు పీహెచ్సీ(PHC)లు ఉంటాయి. ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు నర్సులు, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బంది ఉంటారు. ఇద్దరు వైద్యులు, మొబైల్ మెడికల్ యూనిట్తో పాటు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఇతర ప్రదేశాలలో గ్రామాలను సందర్శిస్తారు. అలాగే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల ఇంటి వద్దకు వెళ్తారు. అవసరమైతే శస్త్ర చికిత్సలు ఆరోగ్యశ్రీ కింద నిర్వహిస్తారు.
టెలిమెడిసిన్(Telemedicine) హబ్లు కూడా ఉంటాయి. ఇక్కడ నిపుణులు అందుబాటులో ఉంటారు. రోగులను ఏరియా లేదా జిల్లా ఆసుపత్రులకు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రెఫర్ చేస్తారు. ప్రతి గ్రామ సచివాలయంలో ప్రజల ఆరోగ్యాన్ని సమీక్షించేందుకు 104 అంబులెన్స్ నెలకు రెండుసార్లు ప్రతి గ్రామానికి వెళ్తుంది. అంబులెన్స్లోని వైద్య సిబ్బంది రక్తపోటు, మధుమేహం వంటి చిన్న అనారోగ్యాలను నిర్ధారిస్తారు. చికిత్స చేస్తారు. నెలకు అవసరమైన మందులను కూడా పంపిణీ చేయనున్నారు.
సంబంధిత కథనం