AP Crop Insurance : ఏపీ రైతుల‌కు అప్డేట్ - పంటల‌ బీమా ప్రీమియం చెల్లింపు గడువు పొడిగింపు-extension of deadline for payment of crop insurance premium in andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Crop Insurance : ఏపీ రైతుల‌కు అప్డేట్ - పంటల‌ బీమా ప్రీమియం చెల్లింపు గడువు పొడిగింపు

AP Crop Insurance : ఏపీ రైతుల‌కు అప్డేట్ - పంటల‌ బీమా ప్రీమియం చెల్లింపు గడువు పొడిగింపు

HT Telugu Desk HT Telugu
Dec 20, 2024 03:50 PM IST

రైతుల‌కు ఏపీ ప్ర‌భుత్వం అప్‌డేట్ ఇచ్చింది. పంటల‌ బీమా ప్రీమియం చెల్లింపున‌కు గ‌డువు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. బీమా ప్రీమియంను చెల్లించేందుకు గ‌డువు ఈనెల 15తో ముగిసింది. అయితే ఇంకా చాలా మంది రైతులు బీమా ప్రీమియంను చెల్లించ‌క‌పోవడంతో గ‌డువును ఈనెల 31 వ‌ర‌కు పెంచిన‌ట్లు అధికారులు తెలిపారు.

పంటల‌ బీమా ప్రీమియం చెల్లింపున‌కు గడువు పొడిగింపు
పంటల‌ బీమా ప్రీమియం చెల్లింపున‌కు గడువు పొడిగింపు

రాష్ట్రంలోని 2024-25 సంవ‌త్స‌రానికి ర‌బీ సీజ‌న్‌కు పంట‌ల బీమా ప‌థ‌కాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వ వ్య‌వ‌సాయ శాఖ కార్య‌ద‌ర్శి ఆదేశాల మేర‌కు అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు వ్య‌వ‌సాయ అధికారుల‌తో స‌మావేశాలు, వీడియో కాన్ఫెరెన్స్‌లు నిర్వ‌హించారు. పంట‌ల బీమా ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు రైతులు ప్రీమియం చెల్లించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. దీంతో అన్ని జిల్లా నుంచి మండ‌లం వ‌ర‌కు వ్య‌వ‌సాయ అధికారులు రైతులు బీమా చెల్లింపున‌కు చ‌ర్య‌లు చేప‌ట్టారు. డిసెంబ‌ర్ 31న గ‌డువును పెంచారు.

yearly horoscope entry point

గ‌డువు పెంచ‌డానికి కార‌ణం

రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు గ‌డువును రాష్ట్ర ప్ర‌భుత్వం పొడిగించింది. అయితే పొడిగించ‌డానికి కార‌ణం మాత్రం బీమా ప్రీమియం త‌క్క‌ువ జ‌ర‌గ‌డ‌మే అని వ్య‌వ‌సాయ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 50 శాతం రైతులు కూడా బీమా ప్రీమియం చెల్లించ‌లేదు. దీంతో బీమా ప్రీమియం చెల్లింపు పెంచేందుకు గ‌డువు పెంచారు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 37 నుంచి 40 శాతం మాత్ర‌మే బీమా ప్రీమియం చెల్లించిన‌ట్లు వ్య‌వ‌సాయ శాఖ అధికారులు తెలిపారు.

ఏ పంట‌కు..ఎంత ప్రీమియం?

బీమా ప్రీమియం పంట పంట‌కు వేర్వేరుగా ఉంటుంది. రైతుల వాటా కింద వ‌రికి ఎక‌రాకు రూ. 638, శ‌న‌గ‌కు ఎక‌రాకు రూ.486, వేరుశ‌న‌గకు ఎక‌రాకు రూ.486, జొన్న‌కు ఎక‌రాకు రూ.319, మొక్క జొన్నకు ఎకరాకు రూ.525 చెల్లించాల్సి ఉంటుంది. ఇక పెస‌ల‌కు ఎక‌రాకు రూ.273, మినుములకు ఎక‌రాకు రూ.288, నువ్వుల‌కు ఎక‌రాకు రూ.182, స‌న్‌ప్ల‌వ‌ర్‌కు ఎక‌రాకు రూ.304, టామ‌ట‌కు ఎకరాకు రూ.1,600, మామిడికి ఎక‌రాకు రూ.1,650 చెల్లించాలి. ఉల్లితో పాటు ఇత‌ర పంట‌ల‌కు కూడా బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

బీమా ప్రీమియం ఎలా చెల్లించాలి?

ఆర్ఎస్‌కే అసిస్టెంట్లు, మీ-సేవా, సీఎస్‌సీ సెంట‌ర్లు, ఇన్సూరెన్స్ పోర్ట‌ల్‌లో రైతులు బీమాను నేరుగా చెల్లించ‌వ‌చ్చు. ప్రీమియం చెల్లింపున‌కు పంట రుణ తీసుకున్న రైతులు నేరుగా బ్యాంకు ద్వారా మాత్ర‌మే చెల్లింపులు జ‌ర‌పాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతులతో బీమా ప్రీమియం క‌ట్టించేలా బ్యాంకు సిబ్బంది చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారులు సూచించారు. ర‌బీలో బ్యాంకు ద్వారా పంట రుణాలు పొంద‌ని రైతులు కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ ద్వారా నేరుగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే రైతులే స్వ‌యంగా ఎన్‌సీఐపీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా న‌మోదు చేసుకోవ‌చ్చు.

ఏఏ ప‌త్రాలు ఉండాలి?

కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ ద్వారా నేరుగా ప్రీమియం చెల్లించే రైతుల‌కు కొన్ని ప‌త్రాలు అవ‌స‌రం అవుతాయి. నేరుగా ప్రీమియం చెల్లించే రైతులు ఆధార్ కార్డు జెరాక్స్‌, బ్యాంక్ పాస్‌బుక్‌, ప‌ట్టాదారు పాస్ పుస్త‌కం, పంట ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, ఆధార్ అనుసంధానంమైన మొబైల్ నెంబ‌ర్ వివ‌రాన‌లు జ‌త చేయాల్సి ఉంటుంది. వాటిని కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్‌లో న‌మోదు చేసుకోవాలి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

 

Whats_app_banner

సంబంధిత కథనం