AP Liquor: ఏపీలో గత ఐదేళ్లలో మద్యం, బీర్ల విక్రయాల ద్వారా రూ.3113 కోట్లు దోచుకున్నారనే ఆధారాలున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీలో ఆరోపించారు. గతంలో ఐఎంఎఫ్ఎల్ మద్యం అన్ని రాష్ట్రాల్లో కూడా దొరికే బ్రాండ్లు ఏపీలో కూడా దొరికేవని, గత ఐదేళ్లు స్థానిక బ్రాండ్లను తీసుకొచ్చి మిగిలిన బ్రాండ్లను తొక్కిపెట్టారని ఆరోపించారు.
గతంలో జాతీయ, అంతర్జాతీయ మద్యం కంపెనీలు ఏపీలో మద్యం సరఫరా చేస్తే, గత ఐదేళ్లు వాటిని బెదిరించి, భయపెట్టి వాటిని కంపెనీలను లాక్కున్నారని ఆరోపించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత SNJ, Adan, Leela, NV, B9, Sona, Moonak వంటి కంపెనీలను స్థాపించి ఆయా కంపెనీలకే 60 శాతానికి పైగా మద్యం ఆర్డర్లు ఇచ్చారని ఆరోపించారు. కమిషన్లు ఇవ్వని కంపెనీలను ఎంత దారుణంగా తొక్కిపెట్టారంటే.. 2018లో ఆఫీసర్స్ ఛాయిస్ 35 లక్షల కేసులు సరఫరా చేస్తే.. గత ప్రభుత్వంలో కేవలం 5 లక్షల కేసుల ఆర్డర్లు మాత్రమే ఇచ్చారని వివరించారు. మెక్ డోవల్స్ అయితే 22 లక్షల కేసుల నుండి 5 కేసులకు కుదించారని ఆరోపించారు.
2018-19లో తెలంగాణతో పోలిస్తే రెవెన్యూ వ్యత్యాసం రూ.4186 కోట్లు మాత్రమే ఉందని, కానీ 2023-24 నాటికి ఏకంగా రూ.42,762 కోట్లకు చేరిందన్నారు. ఇందుకు కారణం నాణ్యమైన బ్రాండ్లను దూరం చేసి కల్తీ, నాసిరకమైన జే బ్రాండ్లను తీసుకురావడమేనని కొల్లు రవీంద్ర ఆరోపించారు.
కల్తీ మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్దడంతో జంగారెడ్డిగూడెంలో ఏకంగా 42 మంది ప్రాణాలు కోల్పోయారని, మద్యం నాణ్యతను గాలికి వదిలేయడంతో మద్యం ఆధారిత నేరాలు, ఆత్మహత్యలు, కిడ్నీ, లివర్ సమస్యలు భారీగా పెరిగాయన్నారు. గుంటూరు జీజీహెచ్ డీఅడిక్షన్ కేంద్రంలో 2018లో 343 కేసులుంటే.. 2023 నాటికి ఏకంగా 4913 మందికి చేరారని, కూటమి అధికారంలోకి రాగానే నాణ్యమైన మద్యం అందించడమే లక్ష్యంగా పరీక్షలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈఎన్ఏని 13 రకాలుగా, విస్కీ, బ్రాందీ, జిన్, వోడ్కాను 9 రకాలుగా, రమ్ 9 రకాల పరీక్షలు, బీర్ ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్టు మంత్రి చెప్పారు.
ఏ స్థాయిలో కూడా కల్తీ అవ్వడానికి వీల్లేకుండా ప్రొడక్షన్ నుండి మద్యం షాపుల వరకు శాంపిల్స్ తెప్పించి పరీక్షిస్తున్నామన్నారు. గత ఐదు సంవత్సరాల పాటు ఎక్కడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ అండ్ క్యారీతో ప్రజల్ని దోచుకున్నారని, కూటమి అధికారంలోకి వచ్చాక 3396 షాపుల్ని అత్యంత పారదర్శకంగా కేటాయించామని చెప్పారు.
దరఖాస్తుల ఫీజు రూపంలో రూ.1797 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని, తొలిసారిగా ఏపీలో కల్లుగీత కార్మికులకు 350 షాపులు కేటాయించాం. లైసెన్సు ఫీజులో రూ.103 కోట్ల సబ్సిడీ భరిస్తున్నామని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక 150కి పైగా బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చి వినియోగదారులు కావాల్సిన బ్రాండ్ తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు.
రూ.99కే క్వార్టర్ మద్యాన్ని తీసుకొచ్చి పేదలు కల్తీ మద్యం వైపు, నాటు సారా వైపు మళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఐడీ విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలన్నీ బయట పెట్టడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మద్యం అక్రమాల విచారణకు సెట్ ఏర్పాటు చేసిన రోజునే తాడేపల్లి ప్యాలెస్ వద్ద డాక్యుమెంట్లు తగులబెట్టారని, ప్రజల జేబులు కొల్లగొట్టిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
సంబంధిత కథనం