వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. గుంటూరు కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తు, ఇద్దరు జామీన్ల హామీతో గోరంట్ల మాధవ్ కు బెయిల్ ఇచ్చింది కోర్టు. రెండు నెలల పాటు ప్రతీ శనివారం గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టాలని కోర్టు ఆదేశించింది.
గోరంట్ల మాధవ్ తో పాటు ఆయన ఐదుగురు అనుచరులకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ నెల 11 నుంచి గోరంట్ల మాధవ్ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. గత నెల 10న టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ తో పాటు ఎస్కార్ట్ పోలీసులపై దాడి చేసిన కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యారు.
వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ అరెస్టు చేసి తీసుకెళ్తున్న క్రమంలో గోరంట్ల మాధవ్....పోలీసులు వాహనాన్ని వెంబడించి, కిరణ్, పోలీసులపై దాడి చేశారు. దీంతో గోరంట్ల మాధవ్, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసిన పోలీసులు, అరెస్టు చేశారు. ఈ కేసులో గుంటూరు కోర్టు గోరంట్ల మాధవ్ కు బెయిల్ మంజూరు చేసింది.
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు హత్యా రాజకీయాలు, అక్రమ కేసులు వైసీపీ నేతలు, శ్రేణులను ఏమీ చేయలేవన్నారు. రాష్ట్రంలో మరోసారి కూటమి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో రోజుకొక రాజకీయ హత్య జరుగుతుందన్నారు. అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తు్న్నారని మండిపడ్డారు.
"సీఎం చంద్రబాబు ఆలోచన విధానాలకు ఇక నూకలు చెల్లాయి. అక్రమ అరెస్టులకు, తప్పుడు కేసులకు ఇకనైనా పుల్స్టాప్ పెట్టాలి. కూటమి పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ముందుకు వెళ్లాలి. అక్రమ అరెస్టులు చేయిస్తు్న్న సీఎం చంద్రబాబు నా పిక్క మీద వెంట్రుక కూడా పీకలేరు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి గెలిచేది లేదు, వైసీపీ ఓడేది లేదు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు. అక్రమ అరెస్టులకు పుల్స్టాప్ పెట్టి పథకాల దృష్టి పెడితే మంచిది"- మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్
సంబంధిత కథనం