Kodali Nani : ఆ వీడియో టీడీపీ ఆఫీసులోనే ఎడిట్ చేసి ఉంటారన్న కొడాలి నాని…
గోరంట్ల మాధవ్ వీడియో నిజమేనని అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించడాన్ని మాజీ మంత్రి కొడాలి నాని తప్పు పట్టారు. వీడియో టీడీపీ ఆఫీసులోనే తయారు చేసి ఉంటారని, ఫేక్ వీడియోలు తయారు చేయడం, ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించడం చంద్రబాబు కొత్తేమి కాదని విమర్శించారు.
టీడీపీకి చెందిన కొందరు నాయకులు, ఎంపీ మాధవ్ వీడియోను తాము అమెరికాలో ఉన్న ఒక ల్యాబ్కు పంపామని, వారు దాన్ని ఒరిజినల్ అని చెప్పారని అంటున్నారని, ఫేక్ వీడియోను తయారు చేసిన ఫోర్ ట్వంటీ లకు దొంగ సర్టిఫికెట్లు తేవడం కొత్త కాదన్నారు. తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు రావడం కోసం ఎవరిని, ఎక్కడికి పంపించాడో ప్రజలందరికీ తెలుసని నాని విమర్శించారు.
ట్రెండింగ్ వార్తలు
చంద్రబాబు అవసరమైతే ఎంతకు అయినా దిగజారుతాడో తెలుసని, అమ్మాయిలను ఎర వేసి వాడుకోవడానికి కూడా వెనుకాడరని కొడాలి నాని విమర్శించారు. గోరంట్లది ఒరిజినల్ వీడియో కాదని అనంతపురం ఎస్పీ చెప్పారని దాన్ని ఎడిట్ చేసి, ఒక బాడీ, ఒక తలకాయ కలిపి ఎడిట్ చేశారని, అలా ఎడిట్ చేసిన తర్వాత దాన్ని మరో ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో వదిలారని చెప్పారు. ఎడిట్ చేయక ముందు, ఒరిజినల్ వీడియో వస్తే కానీ ఆ బాడీ ఎవరిది? తల ఎవరిది? అన్నది తెలుస్తుందని చెప్పారన్నారు.
అసలు వీడియోను మాయం చేసి, ఎడిట్ చేసి, రికార్డు చేసిన వీడియోలను ల్యాబ్కు పంపారని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు మాట్లాడిన మాటలను అమెరికా ల్యాబ్కు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ.. అని మాట్లాడిన మాటలు చంద్రబాబు మాటలో కాదో ఎందుకు చెప్పలేదన్నారు.
టీడీపీ ఆఫీసులోనే దాన్ని ఎడిట్ చేశారేమో..!
జగన్ మీద బురద చల్లడం కోసం తమ పార్టీకి చెందిన ఒక ఎంపీ మీద ఒక వీడియో తయారు చేశారని, ఆ వీడియో చివరి వరకు మొత్తం చూస్తే.. రబ్ చేసినట్టు ఉందని, దాన్ని లింక్ చేయడం కోసం ఎడిట్ చేసినప్పుడు చూసి ఉంటారని ఆరోపించారు. ఎడిటింగ్ కూడా ఆ పార్టీ ఆఫీసులోనే జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.జగన్ను ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి దొంగ వీడియోలు తీసుకొచ్చి, విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు.
ఎన్టీఆర్ చిన్న కూతురు ఆత్మహత్య చేసుకోవడంపై చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కారణమని తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో, మాధవ్ పేరిట ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఒక మహిళ ఆత్మహత్యను డైవర్ట్ చేసుకోవడం కోసం మాధవ్ వీడియో రూపొందించి రిలీజ్ చేశారని ఆరోపించారు.
2014 నుంచి 2019 వరకు నాడు విపక్షనేతగా ఉన్న వైయస్ జగన్, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడారని, వాటి పరిష్కారం కోసం తపన పడ్డారని అందుకే 2019 ఎన్నికల్లో ఆయనకు అఖండ మెజారిటీతో ప్రజలు పట్టం కట్టారని కొడాలి నాని అన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కనీసం ప్రతిపక్షం హోదా కూడా వస్తుందా? రాదా? అన్నట్లు ప్రజలు ఓట్లు వేసి జగన్ ప్రభుత్వానికి 151 సీట్లు ఇచ్చారని, అంతటి ప్రజాదరణ ఉన్న జగన్ మీద విష ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.