YS Jagan : ఏపీలో ప్రతిరోజూ హత్యాచారాలు, హత్యలు- ఇదేమి రాజ్యం చంద్రబాబు గారూ? : వైఎస్ జగన్
YS Jagan : ఏపీలో మహిళలు, బాలికలకు రక్షణ కరవైంది, ఇదేమి రాజ్యం? అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. బద్వేలు ఘటన అత్యంత హేయమన్నారు. సీఎం చంద్రబాబు వైసీపీపై కక్షతో దిశ వంటి మంచి కార్యక్రమాన్ని నిలిపివేశారని విమర్శించారు.
"ఏపీలో లా అండ్ ఆర్డర్ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం సీఎం చంద్రబాబు" అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు… ఇదేమి రాజ్యం? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయన్నారు. బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానన్నారు. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం కూడా ఉందన్నారు. ప్రజలు నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని విమర్శలు చేశారు.
సీఎం చంద్రబాబు వైసీపీ మీద కక్షకొద్దీ, వైసీపీ తెచ్చిన పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రం మీద, ప్రజలమీద కక్షసాధిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఇది అన్యాయం అని, వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన దిశ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనం అన్నారు. ఇందువల్లే మహిళలు, బాలికల భద్రత ప్రశ్నార్థకం అయ్యిందన్నారు.
దిశ యాప్ తో రక్షణ
“దిశ’’ యాప్లో SOS బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్ను 5సార్లు అటూ, ఇటూ ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ కు, అక్కడ నుంచి దగ్గర్లోనే ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుందన్నారు. వెంటనే పోలీసులు వారికి ఫోన్ చేస్తారని, వారు ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్టు ఫోన్లోచెప్పినా ఘటనాస్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీరుగార్చలేదా? అని ప్రశ్నించారు. “దిశ’’ ప్రారంభం మొదలు 31,607 మహిళలు, బాలికలు రక్షణ పొందితే దాన్ని ఎందుకు దెబ్బతీశారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. 1.56 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న దిశపై రాజకీయ కక్ష ఎందుకని నిలదీశారు.
దిశ గొప్ప కార్యక్రమం
"దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబులు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. 900 బైక్లు, 163 బొలేరో వాహనాలను “దిశ’’ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్ను పటిష్టచేశాం. 18 దిశ పోలీస్స్టేషన్లను పెట్టి, 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చాం. వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్రూమ్కు అనుసంధానం చేశాం. వైసీపీ హయాంలో శాంతిభద్రతలలో “దిశ’’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్లం. దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారు" - వైఎస్ జగన్
దిశ సహా వ్యవస్థలను నిర్వీర్యంచేసి సీఎం చంద్రబాబు ఏం సాధించాలనుకుంటున్నారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. మహిళల రక్షణ, సాధికారతకోసం అమలవుతున్న కార్యక్రమాలను, స్కీంలను ఎత్తివేసి, ఇప్పుడు ఇసుక, లిక్కర్ లాంటి స్కాంలకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఇటు పోలీసు వ్యవస్థ కూడా అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుందన్నారు. పోలీసులు మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను పట్టించుకోవడంలేదన్నారు.
సంబంధిత కథనం