Tirumala Brahmotsavam: బ్ర‌హ్మాండ‌నాయ‌కుని బ్ర‌హ్మోత్స‌వాలకు సర్వం సిద్ధం, నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు-everything is ready for brahmanda nayakus brahmotsava cm chandrababu to tirumala today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Brahmotsavam: బ్ర‌హ్మాండ‌నాయ‌కుని బ్ర‌హ్మోత్స‌వాలకు సర్వం సిద్ధం, నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు

Tirumala Brahmotsavam: బ్ర‌హ్మాండ‌నాయ‌కుని బ్ర‌హ్మోత్స‌వాలకు సర్వం సిద్ధం, నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు

Tirumala Brahmotsavam: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని బ్రహ్మోత్సవాల్లో దర‌్శించుకునేందుకు భక్తులు దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

నేటి నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Tirumala Brahmotsavam: శ్రీ‌వారి సాలికట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు సర్వం సిద్ధమైంది. ధ్వజారోహణంతో నేడు బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి ప‌ట్టువ‌స్త్రాల స‌మ‌ర్ప‌ించనున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. రోజుకు సగటున 80వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. అన్ని రకాల ఆర్జిత సేవలు, విఐపి సిఫార్సు దర్శనాలు రద్దు చేశారు. సామాన్య భక్తుల దర‌్శనాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు స్వయంగా దర్శనాలకు వస్తే మాత్రమే అనుమతిస్తారు.

నేడు ధ్వజారోహణం

అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 5.45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత రాత్రి 9 నుండి 11 గంటల వ‌ర‌కు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు తిరుమలలో ఉంటారు. శనివారం కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఈవో వివరించారు.

బ్రహ్మోత్సవాల్లో సీఎం దర్శనానందరం టీటీడీ 2025 క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించనున్నారు. శనివారం అక్టోబర్ 5వ తేదీ నుంచి తిరుపతి, తిరుమలలోని టీటీడీ విక్రయ కేంద్రాల్లో క్యాలెండర్లు, డైరీలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా 1.32 లక్షల మందికి రూ.300 దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. రోజూ 24వేల సర్వదర్శనం స్లాట్లను కేటాయించనున్నారు.

ఆ రోజుల్లో కరెంట్ బుకింగ్ రద్దు…

శ్రీవాణి దర్శన టికెట్ల కరెంట్ బుకింగ్ ఈనెల 4, 8వ తేదీలలో రద్దు చేశారు. మిగిలిన రోజుల్లో శ్రీవాణి టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. తిరుమలలో 40 వేల మంది భక్తులు బసచేసే అవకాశం ఉంది. వసతి సముదాయాలు 1, 2, 3, 4తో కలిపి 28 హాళ్లు, 670 వరకు లాకర్లు ఉన్నాయి. వీటిలో మరో 20 వేల మంది భక్తులు వీటిలో బస చేయవచ్చని ఈవో వివరించారు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఉదయం 8 నుంచి రాత్రి ఒంటిగంట వరకు నిరంతరాయంగా ఆన్నప్రసా దాలు పంపిణీ చేస్తారు. రోజూ లక్ష మందికి పాలు అందించనున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల వద్ద స్విమ్స్ వైద్యులతో కార్డియాక్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గరుడసేవ రోజున 24 గంటలూ ఘాట్ రోడ్లు తెరిచి ఉంచుతుతారు. శ్రీవారి చక్రస్నానం రోజున భక్తుల భద్రత కోసం గజ ఈతగాళ్ల తోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎసీఆర్ఎఫ్ సిబ్బందిని1 బోట్లను అందుబాటులో ఉంచుతారు. .

మీ పరిసర కార్యకలాపాలపై కూడా నిఘా ఉంచాలన్న ఈవో-

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు విశేష సేవలు అందించాలని, విధులను నిర్వర్తించడంతో పాటు, డిప్యూటేషన్ సిబ్బంది తమ పరిసరాలపై నిఘా ఉంచి, అప్రమత్తంగా ఉండాలని, సమస్యను పరిష్కరించడంలో ప్రముఖ పాత్ర పోషించాలని టిటిడి ఈవో జె శ్యామలరావు అన్నారు.

తిరుమల ఆస్థాన మండపంలో గురువారం సాయంత్రం బ్రహ్మోత్సవాల విధులకు హాజరైన ఉద్యోగులను ఉద్దేశించి ఈఓ మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు పోలీసులు, జిల్లా యంత్రాంగంతో టీటీడీ డిప్యూటేషన్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.