తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వివిధ విభాగాల్లో 597 పోస్టులు భర్తీ చేయాలని.. పాలకమండలి నిర్ణయించింది. రిటైర్డ్ ఐఏఎస్ ఐవీ సుబ్బారావ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు మేరకు.. స్విమ్స్ను అభివృద్ధి చేస్తామని.. టీటీడీ ఈఓ శ్యామలరావు వెల్లడించారు. స్విమ్స్ ద్వారా మరిన్ని వైద్య సేవలందించాలని నిర్ణయించినట్టు చెప్పారు.
'శ్రీవారి వైద్యసేవ ద్వారా ఆసక్తి ఉన్న వాలంటీర్స్ ద్వారా స్విమ్స్లో సేవలు ప్రారంభించాలని నిర్ణయించాం. టీటీడీలోని 29 మంది అన్యమత ఉద్యోగులకు విఆర్ఎస్ ఇచ్చి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. విఆర్ఎస్కు అంగీకరిస్తే.. రిటైర్డ్ బెనిఫిట్స్ తోపాటు అదనంగా రూ.5 లక్షలు ఇవ్వాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది' అని టీటీడీ ఈఓ శ్యామలరావు వివరించారు.
'మఠాల ఆక్రమణలపై పరిశీలన జరుగుతుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం. శ్రీవారి ఆలయ భద్రత దృష్ట్యా.. యాంటి డ్రోన్ టెక్నాలజీ తీసుకురావాలని నిర్ణయించాం. ఒంటిమిట్ట ఆలయంలో త్వరలోనే అన్నప్రసాదం వితరణ చేస్తాం. రాజధాని అమరావతి సమీపంలోని అనంతవరంలో.. శ్రీవారి ఆలయాభివృద్ధికి రూ.10 కోట్లు నిధులు మంజూరు చేశాం' అని శ్యామలరావు వెల్లడించారు.
'తిరుమల కొండల్లో పచ్చదనం పెంచాలన్న సీఎం అదేశాలతో.. ప్రభుత్వ అటవీశాఖకు రూ.4 కోట్లు నిధులు మంజూరు చేశాం. గోవిందనామలను వక్రీకరిస్తూ.. ఇటీవల తమిళ సినిమా డిడి నెక్స్ట్ లెవల్ సాంగ్ రూపొందించడంపై టీటీడీ సిరియస్ అయ్యింది. లీగల్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. టీటీడీలో ఏఐ టెక్నాలజీ డెవలప్మెంట్పై గూగుల్, టీసీఎస్ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి' అని టీటీడీ ఈవో స్పష్టం చేశారు.
'టీటీడీలో ఉద్యోగ పదోన్నతులు అమలుకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వల్ల తలెత్తిన సమస్యలు త్వరలో పరిష్కరించి.. ప్రమోషన్స్ ఇస్తాం. తులాభారం వివాదంపై విజిలెన్స్ విచారణ మొదలైంది. తప్పు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం. తిరుమలలో బిగ్, జనతా క్యాంటీన్లను గతంలో ఆదాయం ప్రాతిపదికన టెండర్లు పిలిచారు. ఆదాయం అనేది టీటీడీ ప్రాధాన్యత కాదు' అని శ్యామలరావు వ్యాఖ్యానించారు.
'భక్తులకు నాణ్యమైన, సరసమైన ఆహారం విక్రయించే బ్రాండెడ్ సంస్థలకు టెండర్లో పాల్గొనే అవకాశం కల్పిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన లైసెన్స్ ఫీజు ప్రకారం.. బ్రాండెడ్ సంస్థలకు క్యాంటీన్ల టెండర్ కేటాయిస్తాం. గోశాలలో గోవులను మరింత ఆరోగ్యంగా సంరక్షించడంపై చర్యలు చేపట్టాం. త్వరలో సత్ఫలితాలు ఇస్తాయి' అని టీటీడీ ఈవో శ్యామలరావు వివరించారు.
సంబంధిత కథనం