Endowment Lands: విజయవాడలో దేవుడి భూములతో దర్జా, హైకోర్టు ఆదేశించినా స్వాధీనం చేసుకోని దేవాదాయశాఖ-endowment department fails to seize land belonging to temple in vijayawada despite high court order ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Endowment Lands: విజయవాడలో దేవుడి భూములతో దర్జా, హైకోర్టు ఆదేశించినా స్వాధీనం చేసుకోని దేవాదాయశాఖ

Endowment Lands: విజయవాడలో దేవుడి భూములతో దర్జా, హైకోర్టు ఆదేశించినా స్వాధీనం చేసుకోని దేవాదాయశాఖ

Sarath Chandra.B HT Telugu

Endowment Lands: ఆలయాల్లో నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దానం చేసిన భూములతో ట్రస్టీలు సొమ్ము చేసుకుంటున్న వైనం విజయవాడలో వెలుగు చూసింది. నగరం నడిబొడ్డున ఉన్న కోట్లాది రుపాయల ఆదాయాన్నిఆర్జించే ఆలయాన్ని దేవాదాయ శాఖ పట్టించుకోకపోవడం వెలుగు చూసింది.

విజయవాడ పటమటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం

Endowment Lands: హిందూ ధర్మ పరిరక్షణ, అధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాల్లో ధూపదీప నైవేధ్యాల కోసం దాన పత్రాలతో దానం చేసిన భూములు పరాధీనమవుతున్నాయి. విజయవాడ నగరంలో కోట్లాది రుపాయల ఖరీదు చేసే దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతమైన వైనం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. దేవుడికి చెందాల్సిన ఆదాయాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్న వారిని ఊపేక్షిస్తున్న వ్యవహారాలు బయటపడు తున్నాయి. నోరు లేని దేవుడి సొమ్మును కాజేయడంలో ఆరితేరిన వారికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది.

విజయవాడ నగరంలో దేవాదాయ శాఖ ద్వారా దేవుళ్లకు చెందాల్సిన ఆదాయాన్ని దర్జాగా దోచుకుంటున్న వైనాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణ,ఆలయాల దూప దీప నైవేధ్యాల కోసం రాసిచ్చిన భూముల్ని, వాటిపై వచ్చే ఆదాయాన్ని భూములిచ్చిన దాతల వారసులే దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

కోట్లాది రుపాయల ఖరీదు చేసే భూముల్ని ఆదాయ మార్గాలుగా మార్చుకున్నారు. దేవాలయాలకు దానం చేసిన భూముల్ని వ్యక్తిగత ఆస్తులుగా పరిగణించే అవకాశం లేకపోయినా దేవాదాయ శాఖ అధికారులతో కుమ్మక్కై పెత్తనం సాగిస్తున్నారు.

విజయవాడ పటమటలో…

విజయవాడలో నల్లూరి వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలను, వాటి భూములను దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు 2022లో తీర్పునిచ్చినా అధికారులు పట్టించుకోని వైనం విజయవాడలో బయటపడింది. హైకోర్టు తీర్పును దేవాదాయ శాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ అక్రమార్కులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రర్డ్‌ దాన పత్రాల ద్వారా దేవాదాయ శాఖకు సంక్రమించిన భూములతో అడ్డగోలుగా సంపాదిస్తున్న వారికి ఆ శాఖ అధికారులు సహకరిస్తున్న వైనం విజయవాడలో తాజాగా వెలుగు చూసింది.

నాడు దాతృత్వం.. నేడు వ్యాపారం..

విజయవాడ పటమటలో ఉన్న నల్లూరి వారి ధర్మతోట 1950కు ముందే ఏర్పడింది. ఈ భూమిలో 94 సెంట్ల భూమిని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి ధర్మకర్తలు రిజిస్ట్రేషన్ చేశారు.1979లో నల్లూరి వారి ధర్మతోటలో ఉన్న 94 సెంట్ల భూమిలో దాతల సహకారంతో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, కళ్యాణమండపం, షాపులను నిర్మించారు. వీటి నిర్మాణానికి ఎంతోమంది విరాళాలు ఇచ్చారు. ప్రస్తుతం కళ్యాణ మండపంలో శుభకార్యాలకు రోజుకు రూ.లక్షన్నర వరకు అద్దె వసూలు చేస్తున్నట్టు ఆలయ వర్గాలు చెబుతున్నాయి.

ఏటా కోట్ల రుపాయల ఆదాయం..

ఆలయాలు, ఫంక్షన్ హాళ్ల ద్వారా ఏటా రూ.2కోట్ల వరకు ఆదాయం సమకూరుతున్నట్టు అక్కడ పనిచేసే అర్చకులు చెబుతున్నారు. ఈ క్రమంలో 2006 నుంచి ఆలయహుండీల ద్వారా వచ్చే ఆదాయం,కళ్యాణ మండపం, దుకాణాల నుంచి వచ్చే ఆదాయాలు దేవాదాయ శాఖకు దక్కడం లేదు. దీనిపై కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ప్రస్తుతం దేవాలయానికి, ఆలయ కమిటీకి సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి నిర్వహణ వెళ్లిపోయినట్టు ఆలయ ప్రధాన అర్చకుడు కసుమూరి రాజగోపాలాచార్యులు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు.

20ఏళ్ల క్రితమే దేవాదాయ శాఖ పరిధిలోకి...

2004లోనే నల్లూరి వారి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణపై వివాదం తలెత్తడంతో సెక్షన్ 43 ప్రకారం ఆలయంతో పాటు, ఫంక్షన్ హాల్‌, దుకాణాలు ఉన్న 94 సెంట్లను దేవాదాయ శాఖకు చెందినవిగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఆలయ ట్రస్టీల్లో ఒకరైన బసవశంకరరావు స్వయంగా దేవాదాయశాఖకు చెందేలా ఆలయ ఆస్తుల్ని రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆ తర్వాత కూడా ఆలయ రికార్డులను, ఆస్తులను స్వాధీనం చేసుకోకుండా వదిలేశారు. దేవాదాయ శాఖకు చెందిన ఆలయంతో పాటు ఫంక్షన్‌ హాల్ 20ఏళ్లుగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉండిపోయింది. ఆలయానికి వస్తున్న ఆదాయానికి లెక్కజమ లేకుండా పోయింది.

దేవాదాయ శాఖ నిర్లక్ష్యంపై పోరాటం..

నల్లూరి వారి వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆంజనేయ ఆలయాలను దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవాలంటూ 2022లో ఆలయ అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ బి. కృష్ణమోహన్ నేతృత్వంలోని ధర్మాసనం వెంకటేశ్వర స్వామి ఆలయం, కళ్యాణమండపం, దుకాణాలను దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత కూడా కోర్టు తీర్పు అమలు కాకపోవడంతో అర్చకులు పలు మార్లు దేవాదాయ శాఖకు ఫిర్యాదులు చేశారు. 2025 జనవరి 8వ తేదీలోకా ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుంటున్నట్టు ఫిర్యాదుదారులకు చెప్పినా అది అమలు కాలేదు. హైకోర్టులో దాఖలైన రిట్‌పిటిషన్‌ 1384/2022పై ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆలయ రికార్డులను స్వాధీనం చేయాలని ట్రస్టీలకు ఆదేశించినట్టు దేవాదాయ శాఖ అధికారులు ఆలయ అర్చకులకు రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు.

మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు...

విజయవాడ పటమటలోని నల్లూరి ధర్మతోటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం ప్రైవేట్ వ్యక్తుల స్వాధీనంలో ఉండటంపై ఆలయ అర్చకులు మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. శ్రీవెంకటేశ‌్వర స్వామి దేవాలయ ధర్మకర్తల సంఘంపై విచారణ జరపాలని అభ్యర్థించారు.

వెంకటేశ‌్వర స్వామి ఆలయం, ఆంజనేయ ఆలయం, కళ్యాణమండపం, దుకాణాలను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలని, ఆలయానికి వచ్చే విరాళాలు, ఫంక్షన్ హాల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వేర్వేరు ఖాతాల్లో ప్రభుత్వం నిర్వహించాలని ఆలయ ప్రధాన అర్చకుడు కసుమూరి రాజగోపాలాచార్యులు మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేశారు.దీనిపై మంత్రి పేషీ విచారణ జరుపుతోందని, ఆలయాలకు చెందిన ఆస్తులు దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే వరకు పోరాటం చేస్తామని ఆలయ వ్యవస్థాపకులు, అర్చకులు చెబుతున్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం