టెక్ కంపెనీలకు 99 పైసలకే ఎకరా భూమి.. కేబినెట్ నిర్ణయం-eligible tech entities will be allotted land across the state ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  టెక్ కంపెనీలకు 99 పైసలకే ఎకరా భూమి.. కేబినెట్ నిర్ణయం

టెక్ కంపెనీలకు 99 పైసలకే ఎకరా భూమి.. కేబినెట్ నిర్ణయం

HT Telugu Desk HT Telugu

‘ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ (LIFT) పాలసీ 4.0’ కింద ఏపీ ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి అర్హత ఉన్న టెక్ కంపెనీలకు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో ఎకరాకు రూ.0.99కే భూమిని కేటాయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.

చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫోటో) (@ncbn X)

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం తీసుకువచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకం, ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తుందని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల్లో ఇది ఒకటి.

ఈ పథకానికి ‘స్త్రీ శక్తి’ అనే పేరు పెట్టారు. దీని అమలు కోసం ఏటా సుమారు రూ.1,942 కోట్లు (నెలకు దాదాపు రూ.162 కోట్లు) ఖర్చు అవుతుందని అంచనా. ఈ పథకం ద్వారా మహిళలకు విద్య, ఉద్యోగం, ఇతర ప్రయాణ అవకాశాలు మెరుగుపడి, మరింత సాధికారత లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ పథకం కొన్ని జిల్లాలకే పరిమితం అవుతుందనే వార్తలను పార్థసారథి ఖండించారు. ‘‘అలాంటి వార్తలు వచ్చాయి. కానీ, ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది” అని ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) మొత్తం 11,449 బస్సుల ఫ్లీట్‌లో 8,456 బస్సులు (దాదాపు 75 శాతం) ఈ 'స్త్రీ శక్తి' పథకం కింద నడుస్తాయి. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం ద్వారా ఏటా 1.4 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందుతారని, దీనివల్ల ఒక్కో కుటుంబానికి నెలకు రూ.1,000 వరకు ఆదా అవుతుందని మంత్రి తెలిపారు.

కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు:

‘ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ (LIFT) పాలసీ 4.0’కి ఆమోదం: రాష్ట్ర విభజన, హైదరాబాద్‌ను కోల్పోయిన నేపథ్యంలో ఏపీ ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి ఈ విధానాన్ని తీసుకువచ్చారు. దీని కింద అర్హత ఉన్న టెక్ కంపెనీలకు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో ఎకరాకు రూ.0.99కే భూమిని కేటాయిస్తారు.

నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పెంపు: నాయీ బ్రాహ్మణుల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం సెలూన్లకు ఉచిత విద్యుత్ కోటాను నెలకు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచారు.

విద్యుత్ సంస్థలకు రుణ హామీ: ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (APPDCL) కు సంబంధించిన క్రెడిట్ రిపోర్టుపై CIBIL, CRISIL వంటి సంస్థల నుంచి నెగటివ్ రిపోర్టింగ్ రాకుండా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.900 కోట్ల ప్రభుత్వ హామీని కేబినెట్ ఆమోదించింది. డిస్కమ్‌ల నుంచి చెల్లింపులు ఆలస్యం కావడమే ఈ ఆర్థిక సమస్యలకు ప్రధాన కారణమని వివరించారు. అలాగే, ఏపీఎస్పీడీసీఎల్ (APSPDCL), ఏపీసీపీడీసీఎల్ (APCPDCL) కోసం రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (RDSS) అమలుకు పీఎఫ్‌సీ లిమిటెడ్ మంజూరు చేసిన రుణాలకు అదనంగా రూ.3,544 కోట్లు, రూ.1,029 కోట్ల ప్రభుత్వ హామీలను కూడా ఆమోదించారు.

మావోయిస్టులపై నిషేధం పొడిగింపు: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)తో పాటు దాని అనుబంధ సంస్థలపై ఉన్న నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్, 1992 ప్రకారం మరో ఏడాది పాటు పొడిగించారు.

ఏపీఐఐసీకి రూ.7,500 కోట్ల రుణం: పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) కు రూ.7,500 కోట్ల రుణాన్ని సమీకరించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

కొత్త అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల మంజూరు: పుట్టపర్తి, మొవ్వ, గన్నవరం, గాజువాక, తిరుపతిలలో ఐదు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను మంజూరు చేసింది.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.