ఓటర్ల జాబితాలలో సవరణలకు సంబంధించి ఆగస్టు ఒకటవ తేదీ నుండి నూతన మార్గనిర్దేశకాలు అమలు కానున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి పలు కీలక మార్పులు చేసింది. ఫారం 6 ఇకపై కొత్త ఓటర్ల నమోదు కోసం మాత్రమే వినియోగించాల్సి ఉంది. ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజక వర్గానికి ఓటరు మారడానికి ఫారం 6లో దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదు.
ఓటరు జాబితాలో పేరు తొలగింపుకు ఉపయోగించే ఫారం 7 విషయంలో ఇకపై మరణ ధృవీకరణ పత్రాన్ని జతచేయవలసి ఉంటుంది. ఫారం 8 విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు దీనిని ఓటర్ల జాబితాలో నమోదు చేసిన వివరాల సవరణ కోసం వినియోగిస్తుండగా, ఇకపై దానిని విభిన్న అంశాలకు వినియోగించనున్నాారు. నియోజకవర్గ పరిధిలోనే కాక, ఇతర నియోజక వర్గాలకు ఓటరు మార్పు, నూతన ఓటరు గుర్తింపు కార్డు జారీ, వైకల్యం ఉన్న వ్యక్తిని గుర్తించడం వంటి అంశాలకు కూడా ఫారం 8 వినియోగించనున్నాారు.
నూతన చట్ట సవరణలను అనుసరించి ఇప్పటికే ఉన్న నమోదై ఉన్న ఓటర్లు 2023 ఏప్రిల్ నాటికి తమ ఆధార్ నంబర్ను తెలియచేయవలసి ఉంటుంది. ఎన్నికల కార్డుతో ఓటరు కార్డు అనుసంధానం పూర్తిగా స్వచ్ఛంధమని, ఆధార్ నంబర్ సమర్పించని వారిని ఓటర్ల జాబితా నుండి తొలిగించటం ఉండదని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి మీనా స్పష్టం చేసారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉన్న వారి ఆధార్ నంబర్ కోసం నూతనంగా ఫారమ్ 6బి ప్రవేశపెట్టారు.
ఎన్నికల సంఘానికి చెందిన ఇసిఐ, ఇరోనెట్, గరుడ, ఎన్ వి ఎస్ పి, వి హెచ్ ఎ తదితర వెబ్ సైట్ లలో ఈ నెలాఖరు నాటికి నూతన ధరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. 6బి ధరఖాస్తును ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ఎన్నికల సంఘానికి సమర్పించవచ్చు. ఎన్ విఎస్ పి, ఓటర్ హెల్ప్లైన్ యాప్లలో కూడా ఓటరు కార్డు, ఆదార్ కార్డుతో అనుసంధానం చేయవచ్చు. స్వీయ ప్రామాణీకరణతో యుఐడిఐఎతో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ ఓటిపిని ఉపయోగించి ఆధార్ అనుసంధానం చేయవచ్చు. స్వీయ-ప్రామాణీకరణ పట్ల ఆసక్తిలేని వారు, స్వీయ-ప్రామాణీకరణ విఫలమైన సందర్భంలో అవసరమైన పత్రాలతో ఫారమ్ 6బి-ని ఆన్లైన్లో సమర్పించవచ్చు. బూత్ లెవల్ అధికారి ఓటరు జాబితాతో ఓటర్ల నుండి ఆధార్ నంబర్ సేకరించడానికి ఇంటింటిని సందర్శించటంతో పాటు ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తారు.
ఆధార్ సంఖ్యను అందించడం పూర్తిగా స్వచ్ఛందమని, ఓటర్లు ఆధార్ నంబర్ ఇవ్వడం ఇస్టం లేకపోతే ఫారం 6బి లో పేర్కొన్న పదకొండు ప్రత్యామ్నాయ పత్రాలలో ఏదైనా ఒక పత్రాన్ని సమర్పించవచ్చు. ఆధార్ సంఖ్య సేకరణ, నిర్వహణ కోసం అన్నిజాగ్రత్తలు తీసుకుంటారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జనబాహుళ్యంలోకి వెళ్లకూడదని సిబ్బందికి ఈసీఐ స్పష్టం చేసింది. ఓటర్ల నుంచి సేకరించిన హార్డ్ కాపీలు ఇఆర్ఓల ద్వారా డబుల్ లాక్ ద్వారా సురక్షితమైన కస్టడీలో ఉంచబడతాయని, యుఐడిఎఐ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల కమీషన్ నియమించిన లైసెన్స్ పొందిన ఆధార్ వాల్ట్లో ఓటర్ల ఆధార్ నంబర్ డేటాను జాగ్రత్త పరుస్తారు.
టాపిక్